ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయక ప్రజలను మోసం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకుని అమాయక ప్రజల డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామంలో శుక్రవారం ఓ ఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కొలుకులపల్లి లింగస్వామికి చండూర్ లోని యూనియన్ బ్యాంకులో ఖాతా ఉంది. ఇటీవల ఆయన అమ్మిన ఇంటి స్తలం డబ్బులు బ్యాంకు లో వేశారు. ఆయనకు డిగ్రీ చదువుతున్న కూతురు ఉంది. ఆన్ లైన్ తరగతులు జరుగుతుండటంతో ఫోన్ కూతురు దగ్గర ఉంచి పని నిమిత్తం వెళ్ళాడు. గురువారం సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి యాప్ ని డౌన్ లోడ్ చేసుకుంటే డబ్బులు వస్తాయని మాయమాటలు చెప్పి ఆమెని నమ్మించారు. తండ్రి బ్యాంకు ఖాతా వివరాలు అడగటంతో ఆమె చెప్పేసింది. అంతే ఖాతా నుంచి ఆగంతుకుడు డబ్బులు మాయం చేయటం మొదలు పెట్టాడు. ఈ విషయం తెలియని తండ్రి శుక్రవారం డబ్బులు డ్రా చేసేందుకు బ్యాంకుకు వెళ్లారు. దీనితో లింగస్వామి షాక్ కు గురయ్యారు. ఆయన ఖాతా నుంచి రూ. 3లక్షలు విత్ డ్రా అయినట్లు గుర్తించారు. వెంటనే బ్యాంకు సిబ్బందిని లింగస్వామి సంప్రదించారు. బ్యాంకు సిబ్బంది పరిశీలించగా ఒడిశాలోని ఓ బ్యాంకు ఖాతాకు డబ్బు బదిలీ అయినట్లు వారు గుర్తించారు. ఈ ఘటనపై బాధితుడు స్థానిక పోలీసు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.