ఫిబ్రవరి 5 వ తేదీన ప్రధాని మోడి తెలంగాణ పర్యటకు రాబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిణామాలు. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ శివారులోని ముచ్చింతల్లో సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ప్రధాని హాజరు కాబోతున్నట్టు సమాచారం. ఈరోజు చినజీయర్ స్వామి ప్రధాని మోడిని కలిసి విగ్రహ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. సమతామూర్తి విగ్రహం ప్రారంభోత్సవానికి వచ్చేందుకు ప్రధాని అంగీకరించినట్టు సమాచారం. ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో 2022 ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 14 వరకు భగవద్రామానుజుల సహస్రాబ్ది వేడుకలు అంగరంగవైభవంగా జరగనున్నాయి. 200 ఎకరాల విశాలమైన విస్తీర్ణంలో వెయ్యికోట్ల రూపాయలతో 216 అడుగుల ఎత్తైన భగవద్రామానుజుల విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ విగ్రహ ప్రారంబోత్సవానికి దేశంలోని ప్రముఖులను చినజీయర్ స్వామి స్వయంగా ఆహ్వానిస్తున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు అమిత్షా, రాజ్నాథ్సింగ్, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తదితరులను చినజీయర్ స్వామి ఆహ్వానించారు.