హుజూరాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని మారినా మున్సిపాలిటీలకు, స్థానిక సంస్థలకు నేరుగా నిధులు ఇవ్వకపోవడంతో అభివృద్ధి జరగలేదని చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక స్థానిక సంస్థలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా ప్రభుత్వ నిధులను అందిస్తున్నారని తెలిపారు.
ఏడేళ్లుగా మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ హుజూరాబాద్ను అభివృద్ధి చేయలేదని తప్పుబట్టారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా పట్టణాభివృద్ధి కోసం 56 కోట్ల నిధులను మంజూరు చేశారని గుర్తుచేశారు. హుజూరాబాద్ను సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్, కరీంనగర్ లాగా అభివృద్ధి చేస్తామని గంగుల కమలాకర్ ప్రకటించారు.