గత సంవత్సరం మాదిరిగానే ఈ వర్షాకాలం కూడా ధాన్యం సేకరణ జరిపిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. పోయిన సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 6545 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. యధావిధిగా ఈసంవత్సరం కూడా ఆ కేంద్రాలన్నింటి ద్వారా ధాన్యం సేకరణజరపాలని ముఖ్యమంత్రి పౌరసరఫరాలశాఖ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎంతమాత్రం ఆందోలన చెందవలసిన అవసరం లేదని సీఎం ప్రకటించారు.
ధాన్యాన్ని శుభ్ర పర్చుకుని తే మ శాతం లేకుండా ఎండపోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావాలని రైతులకు సీఎం సూచించారు. మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలు జరగడానికి కావాల్సిన అన్నిచర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. సోమవారం ప్రగతి భవన్లో ధాన్యం సేకరణపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, సీఎంవో అధికారులు నర్సింగరావు, భూపాల్ రెడ్డి, ప్రియాంక వర్గీస్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.