నిర్మాణంలో ఉన్న కొండాపూర్ ఫ్లైఓవర్ వద్ద పెను ప్రమాదం తప్పింది. ఫ్లైఓవర్ నిర్మణంలో నిర్లక్ష్యం బయటపడింది. మంగళవారం ఉదయం కొండాపూర్ నుంచి మియాపూర్కు వెలుతున్న ఓ కారుపై ఫ్లైఓవర్ నిర్మాణానికి ఉపయోగించే రాడ్డు పడింది. ఈ ఘటనలో కారు పాక్షికంగా ధ్వంసమవగా.. అందులో ఉన్న వారు సురక్షితంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ ఫ్లైఓవర్ నిర్మాణంలో నిర్లక్ష్యం వహించటం ఏమిటని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారు యజమాని మీడియాతో మాట్లాడుతూ.. తాను కొండాపూర్ నుంచి వస్తున్న సమయంలో ప్లైఓవర్ పై నుంచి పెద్ద రాడ్డు తన కారుపై పడిందని, దీంతో కారు చాలా డామేజ్ అయిందని తెలిపారు. ఒకవేళ ఇదే రాడ్ ద్విచక్రవాహనంపై పడి ఉంటే పెను ప్రమాదం జరిగేదన్నారు. ప్లైఓవర్ నిర్మాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కారు యజమాని సత్య ప్రవీణ్ డిమాండ్ చేశారు.