తెలంగాణ ప్రజలు మంత్రి కేటీఆర్ అడగాల్సిన ప్రశ్నలు ఇవీ అంటూ తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వై.ఎస్.షర్మిళ ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలు అందించారు. తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది. ప్రజా సమస్యలపై గళమెత్తుతున్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిర్వహించిన ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంపై సెటైర్లు విసిరారు. తెలియనిది అడిగితే పాపం కేటీఆర్ ఏమని సమాధానం చెప్తారు? అసలు అడగాల్సింది ప్రశ్నలు ఇవి అంటూ ట్విట్ చేశారు. ఈ ప్రశ్నలకు అయితే బాగా సమాధానం చెప్పగలరు కదా చిన్న దొరగారు? అంటూ కేటీఆర్పై విరుచుకు పడ్డారు. ఆస్క్ కేటీఆర్ సేషన్ను ట్విటర్లో గురువారం మంత్రి కేటీఆర్ నిర్వహించారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ సేషన్లో నెటిజన్లు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిని గుర్తు చేస్తూ అసలు ప్రజలు అడగాల్సిన ప్రశ్నలు ఇవి అంటూ వైఎస్ షర్మిల ట్విట్ చేశారు. మద్యం అమ్మకాలను పెంచడం ఎలా? ఆడవాళ్ల మానప్రాణాలకు హాని కలిగించడం ఎలా? జనాలను డ్రగ్స్కు బానిస చెయ్యడం ఎలా? రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం ఎలా? నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొనేలా చేయడం ఎలా? అనే ప్రశ్నలతో కేటీఆర్ను నిలదీయాలని షర్మిల ట్విట్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని, కేటీఆర్ను అడగాల్సింది.. దళితులను మోసం చేయడం ఎలా? వరి వేసిన వాళ్లకు ఉరి వేయడం ఎలా? ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టడం ఎలా? ఉద్యమకారులను తొక్కేయడం ఎలా? ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపించడం ఎలా?పార్టీ లీడర్లు తప్పులు చేస్తే కాపాడుకోవడం ఎలా? వీటికైతే బాగా సమాధానం చెప్పగలరు కదా చిన్న దొరగారు? అంటూ కేటీఆర్ పై షర్మిల రెచ్చిపోయారు.