ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రీజినల్ రింగ్ రోడ్లలో ముందడుగు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 15, 2022, 05:05 PM

మహానగరం హైదరాబాద్ కు మరో మహర్థశ పట్టనున్నది.  తెలంగాణ భవిష్యత్ ముఖచిత్రాన్ని మార్చేసే ప్రాజెక్టుగా చెబుతోన్న హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు పనులు శరవేగంగా సాగుతున్నాయి. సుమారు 16 వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ నగరానికి సమీపంలోని జిల్లాలు, ముఖ్య పట్టణాలను కలుపుతూ ఆర్ఆర్ఆర్ నిర్మాణం కానుంది. సుమారు 340 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) రహదారి అలైన్‌‌మెంట్‌కి ఆమోదం తెలపడంతో పనులు వేగం పుంజుకున్నాయి. తొలి దశలో హైదరాబాద్ నగరానికి ఉత్తరం వైపు 158 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించనున్నారు. అందుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. ఉత్తర భాగంలో రింగ్ రోడ్డుకి సంబంధించి మెదక్, సిద్దిపేట జిల్లాల్లో అధికారులు భూముల సర్వే చేపట్టారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్, తూప్రాన్, సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, వర్గల్ మండలాల పరిధిలో అధికారులు సర్వే చేస్తున్నారు. రహదారి హద్దులను గుర్తిస్తున్నారు. ఎన్‌హెచ్‌ఏఐ ఈ సర్వేను ప్రారంభించినట్టు తెలుస్తోంది. తొలిదశ రోడ్డు నిర్మాణానికి మొత్తం 4,600 ఎకరాలకు పైగా భూములు అవసరమవుతాయని అంచనా. ప్రాజెక్టుకి అవసరమయ్యే భూములను సేకరించేందుకు ఇప్పటికే ఎన్‌హెచ్‌ఏఐ సంస్థ సంబంధిత ఆర్డీవోలను ప్రత్యేకాధికారులుగా నియమించింది. సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, ఆందోల్ ఆర్డీవోలు, మెదక్‌లో నర్సాపూర్, తూప్రాన్, సిద్దిపేట జిల్లాలో గజ్వేల్, యాదాద్రి జిల్లాలో భువనగిరి, చౌటుప్పల్ ఆర్టీవోలను ప్రత్యేకాధికారులుగా నియమించింది. సర్వే అనంతరం ప్రత్యేకాధికారుల ద్వారా నోటిఫికేషన్ జారీ చేయనుంది. భూ నిర్వాసితులకు నోటీసులు, పరిహారం తర్వాత భూముల సేకరణ ప్రక్రియ మొదలుకానుంది. నెల రోజుల్లో సర్వే పూర్తయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే భూముల సర్వే చేస్తున్న గ్రామాల ప్రజల్లో అయోమయం నెలకొంది. అత్యాధునిక పరికరాలు, డ్రోన్లు, జీపీఎస్‌ సర్వేతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎందుక సర్వే చేస్తున్నారో తెలియక తికమకపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్ ప్రకారం కొన్నిచోట్ల చిన్నచిన్న తండాలు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీంతో స్థానికుల్లో తెలియని ఆందోళన కనిపిస్తోంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com