తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరుగుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలో 1,07,904 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,983 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. థర్డ్ వేవ్ మొదలయ్యాక ఇన్ని పరీక్షలు, కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కాగా రాష్ట్రంలో జ్వరం, జలుబు దగ్గు వంటి లక్షణాలతో లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నారు. సంక్రాంతికి ఊర్లకు వెళ్లొచ్చిన వారిలో అనేక మంది కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. ఇక సామాన్య జనంతో పాటు ఆయా శాఖల్లోని అధికారులకు కరోనా సోకడం రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తోంది. మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రిలో 42 మంది వైద్య సిబ్బందికి వైరస్ సోకగా, తాత్కాలిక సచివాలయం బీఆర్కేఆర్ భవన్ లో 15 మందికి పైగా అధికారులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు. పోలీసు శాఖలోను భారీగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరిస్తున్నారు.