భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకల పల్లి మండలంలో రాచన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివాసీ గూడెం, సాకివాగుకు చెందిన ముగ్గురు ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ బీట్ గార్డులు అమానుషంగా ప్రవర్తించారన్న సంఘటనపై రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. వెంటనే ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేసి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్ ను ఆదేశించారు.ఆదివాసీ మహిళలకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి అన్ని విధాల న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే అడవిలో జీవనాధారం నిమిత్తం అటవీ ఉత్పత్తుల కోసం వెళ్లే ఆదివాసీల జోలికి వెళ్లొద్దని పలుసార్లు హెచ్చరించామన్నారు. అయినా కొంతమంది ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, వారిని ఉపేక్షించేది లేదన్నారు. మంత్రి ఆదేశాలతో అధికారులు వెంటనే స్పందించి, విచారణ ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటిడిఏ ప్రాజెక్టు అధికారికి దీనిపై వెంటనే విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.