జాతీయ పట్టణ ఉపాధిహామీ పథకానికి నిధులు మంజూరు చేయాలనీ కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. దేశంలో పట్టణీకరణ భారీ స్థాయిలో సాగుతోందని లేఖలో పేర్కొన్నారు. వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ వల్ల పట్టణ పేదరికం కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. పట్టణాలకు వచ్చే పేద ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు రావాలంటే వారి ఆదాయ వనరులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణ పేదలకు కనీస అవసరాలు అందాలంటే వారికి ఉపాధి హామీ ఇచ్చినప్పుడే అది సాధ్యమవుతుందన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంతోపాటు పట్టణ ప్రాంతాల్లోనూ కేంద్రం ప్రత్యేకంగా ఉపాధి హామీ పథకాన్ని బడ్జెట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు గతంలో పార్లమెంటరీ స్థాయి సంఘంతోపాటు సీఐఐ వంటి సంస్థలు చేసిన సిఫారసులను కేటీఆర్ ఉదహరించారు. ఇప్పటికే దేశ జనాభాలో 30 శాతానికి పైగా పట్టణాల్లో నివసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పట్టణ పేదల కోసం ఈ బడ్జెట్లో ప్రత్యేక ఉపాధి హామీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రాన్ని కేటీఆర్ కోరారు. ఈ మేరకు పట్టణీకరణ, పట్టణ పేదరికం, పట్టణ పేదల జీవితాల్లో సానుకూల మార్పు కోసం తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై కేంద్రానికి కేటీఆర్ కీలక సూచనలు చేశారు.