ఆగి ఉన్న లారీని ఢీకొని యువకుడు దుర్మరణం చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ ఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన వికాస్ కాటిరం ముదోయ్ (26) ఉపాధి కోసం నగర శివారు మేడ్చల్ లోని గౌడవెళ్లికి వచ్చాడు. కూలి పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాడు. స్థానికంగా గల బీరప్ప కాలనీలో ఉండే స్నేహితులను కలిసేందుకు గురువారం రాత్రి వచ్చి తిరిగి వెళుతున్నాడు. అయితే అయోధ్య చౌరస్తా ఫ్లిప్ కార్ట్ వద్ద నడిరోడ్డుపై ఎలాంటి ఇండికేటర్లు లేకుండా ఆగిన డ్రైవర్ చిరునామా అడుగుతుండగా లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వికాస్కు హెల్మెట్ లేకపోవడంతో తలకు బలమైన గాయలై అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి దర్యాప్తు చేస్తున్నారు.