తెలంగాణలో సీఎం కేసీఆర్ను గద్దె దించేందుకు తాను అవసరం లేదని, బండి సంజయ్ ఒక్కడు చాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. బీజేపీ తెలంగాణ చీఫ్, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభను రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో శనివారం నిర్వహించారు. సభకు హాజరైన అమిత్ షా టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పి కేసీఆర్ ఎందుకు వెనక్కి తగ్గారని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో గద్దెనెక్కిన కేసీఆర్ వాటిని మరిచారన్నారు. కుటుంబం మొత్తానికి పదవులు కట్టబెట్టారన్నారు. తెలంగాణలో హత్యారాజకీయాలను కేసీఆర్ మొదలు పెట్టారన్నారు. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్కు సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లే సాధ్యమైందని గుర్తు చేశారు. టీఆర్ఎస్ను ఇంటికి సాగనంపాలని తెలంగాణ ప్రజలకు సూచించారు.
బండి సంజయ్ చేపట్టిన యాత్ర అధికార బదలాయింపు కోసం కాదని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకని అమిత్ షా చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. అంతకు ముందు బండి సంజయ్ ప్రసంగించారు. శ్రీలంకలో కుటుంబ పాలన వల్లే ఆ దేశం ఆర్థికంగా దివాళా తీసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిందన్నారు. దానిని విడిపిస్తామని, నిజాం సమాధి వద్ద మోకరిల్లే టీఆర్ఎస్ను సాగనంపుతామని అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ అమిత్ షా తెలంగాణకు రావాలంటే కేసీఆర్ పర్మిషన్ అవసరమా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం పైన టీఆర్ఎస్కు ఎంత హక్కు ఉందో తమకూ అంతే హక్కు ఉందన్నారు.