అనతికాలంలోనే అభివృద్ధిని సాధించి రాష్ట్రాన్ని ముందంజలో నిలిపిన తెలంగాణ పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ఆయన దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ధర్మ స్థాపనకు నిదర్శనంగా, విజయాలను అందించే విజయ దశమిగా దసరా పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారని సీఎం అన్నారు. దసరా రోజున శుభసూచకంగా పాలపిట్టను దర్శించి పవిత్రమైన జమ్మిచెట్టుకు పూజలు చేసే సాంప్రదాయం గొప్పదన్నారు. జమ్మి ఆకును బంగారంలా భావించి పంచుకొంటూ, పెద్దల ఆశీర్వాదాలను అందుకుంటూ, అలయ్ బలయ్ తీసుకొంటూ ప్రేమాభిమానాలను చాటుకోవడం దసరా పండుగ ప్రత్యేకత అని సీఎం అన్నారు.
తెలంగాణ స్ఫూర్తితో దేశం ప్రగతిబాటలో నడువాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. విజయానికి సంకేతమైన దసరా నాడు తలపెట్టిన కార్యాలన్నీ ఫలించాలని సీఎం ప్రార్థించారు. విజయ దశమి స్ఫూర్తిని కొనసాగిస్తామని అన్నారు. ప్రజలందరూ సుఖ శాంతులతో వర్ధిల్లాలని దసరా సందర్భంగా సీఎం కోరుకున్నారు. మరోవైపు మంత్రి కేటీఆర్ కూడా రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.