ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీలో కోవర్టు వ్యాఖ్యల కలకలం... ఈ విషయంలో ఈటల, బండి చెరో మాట

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 30, 2023, 05:43 PM

రాష్ట్రంలో అధికార పగ్గాలు  చేపట్టాలని భావిస్తున్న తెలంగాణ బీజేపీకి ఆదిలోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇధిలావుంటే తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. అధికారం చేజిక్కుంచుకోవటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. సౌత్‌పై ఫోకస్ పెట్టిన బీజేపీ కర్ణాటక తర్వాత తెలంగాణలో అధికారంలోకి రావాలని ఉవ్విలూరుతోంది. ఈక్రమంలోనే తెలంగాణ బీజేపీ నేతలు బీఆర్ఎస్‌ను గద్దెదించి అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తున్నారు. టార్గెట్ ఫిక్స్ చేసి మరీ కమళనాథులు ఎన్నికల కథనరంగంలోకి దిగుతున్నారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 6 నాటికి పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పక్కా స్కెచ్ వేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీలో ముసలం మెుదలైనట్లు సమాచారం. అందుకు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలే కారణంగా తెలుస్తోంది.


ఇటీవల ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన ఈటల రాజేందర్ అన్ని పార్టీల్లోనూ కేసీఆర్ కోవర్టులున్నారని వ్యాఖ్యనించారు. ఆ ఇన్‌ఫార్మర్లే పార్టీలను దెబ్బతీస్తున్నారని.., తమ వ్యూహాలను కేసీఆర్‌కు చేరవేరుస్తున్నారని అన్నారు. ఈటల బీజేపీలో తీవ్ర కలకలానికి దారితీశాయి. కషాయదళంలో నిజంగానే కేసీఆర్‌ ఇన్‌ఫార్మర్లు ఉన్నారా ? ఆ నాయకులెవరు ? కేసీఆర్‌కు పరోక్షంగా సహకరిస్తున్నదెవరనేది పెద్ద చర్చకు దారి తీసింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఈటల కోవర్టు ఆరోపణలు చేయటం ప్రాధాన్యతను సంతరించకుంది.


లీకుల కారణంగా ఇతర పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరేందుకు వెనకడుగు వేస్తున్నారని ఈటల ఇటీవల ఆఫ్‌ది రికార్డ్ మాట్లాడినట్లు సమాచారం. నిజానికి ఈ కోవర్టుల అంశం మునుగోడు ఉప ఎన్నిక సంయంలోనే తెరపైకి వచ్చింది. ఆ ఎన్నికలో బీజేపీ అభ్యర్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిస్తే.. బీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయం అనే సంకేతం వెళ్లేది. కానీ ఎన్నికకు రెండు రోజుల ముందు బీజేపీకి చెందిన ముఖ్య నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ నేతలే బీజేపీ వ్యూహాలను కేసీఆర్‌కు అందుజేశారనే టాక్ వినిపించింది. మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి 10 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కోవర్టుల కారణంగా పార్టీకి నష్టం జరిగిందని చర్చ జరిగింది.


అయితే ఈటల కోవర్టు ఆరోపణలు చేస్తే.. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడారు. నిన్న (ఆదివారం) మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ తమ పార్టీలో కోవర్టులెవరూ లేరని అన్నారు. బీజేపీలో కోవర్టులుండే ఛాన్సే లేదని తేల్చి చెప్పారు. ఈటల అలా మాట్లాడి ఉండి ఉండరని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో కోవర్టుల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ బీజేపీలో హాట్ టాఫిక్‌గా మారింది. అసలేం జరుగుతోందో అర్థం కాక తెలంగాణ బీజేపీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ఇతర పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరకపోవడానికి కోవర్టు రాజకీయాలే ప్రధాన కారణమనే అభిప్రాయంతో చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల ఉన్నారా ? లేక బీజేపీలో కుదురుకునే విషయంలో ఈటల ఇంకా ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా ? అనే చర్చ తెలంగాణలో బీజేపీలో జోరుగా నడుస్తోంది.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com