తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దికాలంగా బీఆర్ఎస్ సర్కార్ వర్సెస్ గవర్నర్ అన్నట్లుగా వార్ కొనసాతున్న విషయం తెలిసిందే. కానీ ఈ వార్ లో ఒక అంశంలో మాత్రం ఇరువురి మధ్య సయోధ్య కుదిరింది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఆమోదంపై ప్రభుత్వానికి గవర్నర్కు మధ్య సయోధ్య కుదిరింది. బడ్జెట్ను ఆమోదించేలా గవర్నర్ను ఆదేశించాలంటూ ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన లంచ్మోషన్ పిటిషన్ను వెనక్కి తీసుకుంది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం తరఫు న్యాయవాది దుశ్యంత్ దవే హైకోర్టుకు తెలిపారు. గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు మెుదలవుతాయని చెప్పారు. గవర్నర్ను విమర్శించొద్దన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు.
2023-24 ఆర్థిక సంవత్సరానకి సంబంధిన బడ్జెట్ను అసెంబ్లీలో వచ్చే నెల 2న (శుక్రవారం) ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఆమోదం తెలపాల్సిందిగా.. గవర్నర్కు బడ్జెట్ పత్రులను పంపించారు. బడ్జెట్ ప్రవేశపెట్టాడానికి ముందు గవర్నర్ ప్రసంగం ఉంటుందని, దానికి సంబంధించిన కాపీ తమకు పంపారా ? లేదా ? అని గవర్నర్ కార్యాలయం తిరిగి ప్రభుత్వానికి ఒక లెటర్ రాసింది. గవర్నర్ కార్యాలయం నుంచి వెళ్లిన లెటర్కు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బడ్జెట్కు ఆమోదం తెలిపే ప్రక్రియను గవర్నర్ తమిళిసై కూడా పెండింగ్లో పెట్టారు. దీంతో అధికార వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరో నాలుగు రోజులే సమయం ఉండటంతో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.
బడ్జెట్ను ఆమోదించేలా గవర్నర్ను ఆదేశించాలంటూ ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో గవర్నర్కు కోర్టు నోటీసు ఇవ్వగలదా ? అని అడ్వకేట్ జనరల్ ఏజీని ప్రశ్నించింది. గవర్నర్ విధుల్లో కోర్టులు న్యాయసమీక్ష చేయొచ్చా ? కోర్టులు మితిమీరి జోక్యం చేసుకుంటున్నాయని మీరే అంటారు కదా? అని ఏజీని ఉద్దేశించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్పై జరిగే విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తారని ఏజీ తెలిపారు. లంచ్ మోషన్కు అనుమతిస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అడ్వకేట్ జనరల్ సమాధానంతో మధ్యాహ్నం ఒంటిగంటకు విచారణ జరిపేందుకు సీజే ధర్మాసనం అంగీకరించింది.
అయితే.. బడ్జెట్ ఆమోదం విషయంలో హైకోర్టు సూచనతో రాజ్ భవన్, ప్రభుత్వ తరఫు న్యాయవాదుల మధ్య చర్చలు జరిగాయి. ప్రభుత్వం తరపున దుశ్యతం దవే, రాజ్ భవన్ తరపున అశోక్ ఆనంద్ చర్చించుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు రాజ్యాంగబద్ధంగా నిర్వహించాలని న్యాయవాదులు చర్చించుకున్నారు. బడ్జెట్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని.., గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభమవుతాయని కోర్టుకు తెలిపారు. బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు గవర్నర్ అనుమతించనున్నట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తాము దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇరువైపుల న్యాయవాదుల సమ్మతితో హైకోర్టు విచారణను ముగించింది.