దేశంలోని వివిధ రాష్ట్రాల ఎన్నికల కోణంలో కేంద్రంలో నేడో, రేపో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టే అవకాశం ఉందన్న వార్తలు ఊపందుకున్నాయి. వివిధ రాష్ట్రాల్లో అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్డీయే కూటమి నుంచి కొన్ని రాజకీయ పార్టీలు పక్కకు తప్పుకున్నాయి. మంత్రులుగా ఉన్న కొంత మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం పూర్తవడంతో వారిని కొనసాగించలేదు. ఈ నేపథ్యంలో మోదీ క్యాబినెట్లో ఖాళీలు ఏర్పాడ్డాయి. అంతేకాకుండా.. ఈ ఏడాదిలో 9 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో వివిధ సమీకరణల ఆధారంగా ఆయా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ మంత్రివర్గంలోకి కొత్త రక్తాన్ని ఎక్కించే యోచనలో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తెలంగాణ నుంచి మరొకరికి మంత్రివర్గంలో అవకాశం దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజేపీ తరఫున కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు.. లోక్సభకు ఎన్నికయ్యారు. వీరితో పాటు రాష్ట్రానికి చెందిన మరో సీనియర్ నేత డాక్టర్ కె లక్ష్మణ్కు ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు. వీరిలో కిషన్ రెడ్డికి ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇక తాజా విస్తరణలో మిగిలిన వారిలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తెలంగాణ రాష్ట్రం నుంచి నలుగురు ఆశావహుల్లో బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, కె లక్ష్మణ్.. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఇప్పటికే కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఇక మిగిలిన ముగ్గురిలో గిరిజనుల ప్రతినిధిగా ఉన్న సోయం బాపూరావు వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
వాస్తవానికి కిందటిసారి మంత్రివర్గ విస్తరణ సమయంలో సోయం బాపూరావుకు పిలుపు వచ్చిందని.. అయితే, చివరి నిమిషంలో గిరిజన మహిళకు అవకాశం కల్పించడంతో ఆయనకు ఛాన్స్ దక్కలేదని పార్టీ వర్గాలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి సోయం బాపూరావును అదృష్టం వరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తున్నారు. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటే.. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లోనూ కొంత మేరకు ప్రభావం ఉంటుందనే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.