2023-24కేంద్ర బడ్జెట్ 2023 ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనున్న0దున ఆ బడ్జెట్ పై పెన్షనర్లు, ఉద్యోగులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పెన్షనర్లు తమను కరుణించి ఆదాయపు పన్ను నుంచి మినహాయిస్తారా? అంటూ ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. గత ఆరు ఏళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్షనర్లను ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కోరుతూ ప్రధాన మంత్రికి పోస్ట్ కార్డులు పంపుతున్నారు. కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాల ఎదుట ధర్నాలు చేస్తున్నారు. ప్రతి ఏటా ఫిబ్రవరి చివరి వారంలో గత ఆరేళ్లుగా తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్య పిలుపు మేరకు జగిత్యాల జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా పెన్షనర్లు ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేస్తున్నారు. పెన్షనర్స్ జేఏసీ కేంద్ర చైర్మన్ గాజుల నర్సయ్య ఆధ్వర్యంలో ఢిల్లీలో కేంద్ర ఆర్ధికమంత్రికి, ఎంపీలకు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. ఈసారి ఎన్నికలు ముందటి పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో ఏమైనా ఊరట లభిస్తుందేమోనని భావిస్తున్నారు.
ఇప్పుడుకూడా తమ ఆశలు వమ్ము చేస్తే మళ్ళి మార్చి మొదటి వారంలో ధర్నాలు, వినతిపత్రాలు అందజేసి అలాగే ప్రధాన మంత్రికి పోస్ట్ కార్డులు పంపుతూ డిమాండ్ చేస్తామని అసోసియేషన్ ప్రతినిధులు జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్, కార్యదర్శి బొల్లం విజయ్, కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం, ప్రకాష్, కరుణ, ఆశోక్ రావు, సత్యనారాయణ, పబ్బా శివానందం, రాజ్ మోహన్, సైఫోద్దిన్, లక్ష్మీనారాయణ, జిల్లా, డివిజన్, మండల యూనిట్ల ప్రతినిధులు మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ప్రకటించారు.
క్షేత్ర స్థాయిలో పెన్షనర్లపై భారం, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని గౌరవ భృతి గా ఇస్తున్న ప్రతి నెలా ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ పై ఆదాయపు పన్ను మినహాయింపు చేయాలని కోరుతున్నారు.