ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఆయన వర్గీయులు టిక్కెట్టు రాజకీయాలతో రాద్ధాంతం చేస్తున్నారని తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వర్గం నేతలు విమర్శించారు. గురువారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ (నయూం) ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, అప్పూతో పాటు నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తాండూరు టిక్కెట్ నాదే, నిలిచేది నేనే. గెలిచేది నేనే. అంటూ చేసిన వాఖ్యలను ఖండించారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితోనే నియోజకవర్గం అభివృద్ధి సాధించిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామానికి రూ. 50 లక్షలు, మండల కేంద్రానికి, మున్సిపల్ వార్డులకు రూ. 1 కోటి నిధులు సాధించిన ఘనత పైలెట్ రోహిత్ రెడ్డికే దక్కిందన్నారు. వచ్చే ఎన్నికల్లో తాండూరు ఎమ్మెల్యేగా పోటీ చేసేది ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అని, ఎవరు పోటీ చేసినా వెనక్కి తగ్గేది లేదన్నారు. రోహిత్ రెడ్డి గెలుపును ఆపే శక్తి ఎవ్వరికి లేదన్నారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా తాండూరు అభివృద్ధికి కృషి చేసిందేం లేదన్నారు. గతంలో కాగ్నా బ్రిడ్జి టెండర్లు, రోడ్డు టెండర్ల విషయంలో అడ్డంకులు సృష్టించెదెవరో అందరికీ తెలుసన్నారు. ఆయన తీసుకవచ్చిన నిధులన్నీ రోటీన్ గా వచ్చినవే అని విమర్శించారు.