ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 26, 2024, 08:27 PM

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య రైతు రుణమాఫీ అంశం మాటల యుద్ధానికి దారి తీసింది. ఆగస్టు 15 లోగా ఏకకాలంలో రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేయటంతో పాటు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేయాలని.. అలా చేస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇవాళ ఉదయం గన్‌పార్క్ వద్దకు వెళ్లిన ఆయన.. జర్నలిస్టుల సాక్షిగా తన రాజీనామా లేఖను సమర్పిస్తున్నానని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన సవాల్ స్వీకరించి.. రాజీనామాకు సిద్ధం కావాలన్నారు.


హరీష్ రావు సవాల్‌పై సీఎం రేవంత్ రెడ్డి ధీటుగా స్పందించారు. హైదరాబాద్‌లో పార్టీ సోషల్ మీడియా వారియర్లతో సమావేశమైన ఆయన.. హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఆగస్టు 15 లోపు కచ్చితంగా రూ. 2 లక్షల లోపు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పారు. రైతులకు రుణమాఫీ చేయలేకపోతే తమకు అధికారమెందుకని ప్రశ్నించారు. ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. ఆరు నూరైనా ఆగస్టు 15 లోపు రుణమాఫీ అమలు చేస్తామని హరీష్ రావు తన రాజీనామా లేఖను సిద్ధంగా పెట్టుకోవాలని కౌంటర్ ఇచ్చారు.


రాజీనామా లెటర్‌తో హరీష్ గన్‌పార్క్ వద్దకు చేరుకోవటంపైనా రేవంత్ రియాక్ట్ అయ్యారు. ఓ సీస పద్యం రాసుకొచ్చి రాజీమామా లెటర్ అంటూ హరీష్ డ్రామాలు మెుదలు పెట్టారని సీఎం విమర్శించారు. రాజీనామా లెటర్‌కు స్పీకర్ ఫార్మాట్ ఉంటుందని.. అందులో ఒక్క అక్షరం తప్పుపోయినా ఆ లెటర్ చిత్తు కాగితంతో సమానం అన్నారు. తాను రుణమాఫీ చేసి తీరుతానని స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లెటర్ సిద్ధం చేసుకోవాలని హరీష్‌కు సూచించారు.


సెమీ ఫైనల్‌లో బీఆర్ఎస్ పార్టీపై విజయం సాధించామని.. ఫైనల్‌గా భావించే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని రేవంత్ విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ ఈ దేశానికి అత్యంత ప్రమాదకరమని.. ఆ పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తారన్నారు. బీజేజీ రాజ్యంగ హక్కులకు భగం కలిగిస్తోందని విమర్శించారు. ఎన్డీయే పాలనలో దేశం రూ.168 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయిందన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని.. తెలంగాణలో 14 సీట్లు రావాల్సిందేనని సీఎం రేవంత్ అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com