ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ సీఎం కేసీఆర్‌ మీద పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 27, 2024, 07:34 PM

మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఇటీవలే కేసీఆర్ ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. కాగా.. ఈ ఇంటర్వ్యూలో రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేసీఆర్ తొలిసారి స్పందించారు. కాగా.. ఇంటర్వ్యూలో కేసీఆర్ మాట్లాడిన మాటలను సుమోటుగా తీసుకొని కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని న్యాయవాది అరుణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ ఫోన్ టాపింగ్ విషయమై వివిధ ఛానళ్లకు మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు ఇవ్వడాన్ని అరుణ్ కుమార్ తప్పుబట్టారు.


ప్రస్తుతం.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా పరిగణిస్తున్న ఇంటలిజెన్స్ మాజీ చీఫ్‌ ప్రభాకర్ రావు అందుబాటులో లేకపోయినా.. కేసిఆర్‌తో పాటు అప్పటి కేబినెట్‌లోని 39 మంది ఎమ్మెల్యేలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు అరుణ్ కుమార్ తెలిపారు. మరోవైపు.. తన ఫిర్యాదు పట్ల పోలీసులు అలసత్వం వహిస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయని.. తన కంప్లైంట్‌ మీద తక్షణమే కేసు నమోదు చేసి కఠిమైన చర్యలు తీసుకోవాలని అరుణ్ కుమార్ కోరారు.


 ఇదిలా ఉంటే.. ఇటీవలే ఓ ప్రముఖ మీడియా ఛానెల్‌లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్.. పలు కీలక అంశాలపై స్పందించారు. కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ.. సుదీర్ఘ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, రైతుబంధు, రుణమాఫీ లాంటి పథకాల్లో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుండగా.. వాటిపై కేసీఆర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఈ క్రమంలోనే.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా స్పందించారు కేసీఆర్. ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రతి సర్కారులో జరుగుతుందని.. అది భద్రతా విభాగం చేసే పని అని.. దానికీ సీఎంకు ఎలాంటి సంబంధం ఉండదంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న సీఎంకు కూడా ఇంటెలిజెన్స్ నుంచి నిత్యం సమాచారం అందుతుందని చెప్పుకొచ్చారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com