ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెరువులో నిర్మాణాలు.. హైకోర్టు కీలక ఆదేశాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 27, 2024, 07:46 PM

హైదరాబాద్‌లో చాలా వరకు చెరువులు కబ్జాకు గురయ్యాయి. చెరువులను పూడ్చేసి అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఈ కబ్జాలపై కొందరు కోర్టులను ఆశ్రయించారు. తాజాగా.. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్‌టీఎల్‌లో వాసవి ఇన్‌ఫ్రా ఎల్‌ఎల్‌పీ నిర్మాణాలు చేపడుతోందని ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం అందుకు తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్‌కు ఆదేశాలు జారీచేసింది. వీటితోపాటు ఈ నెల 25న బాచుపల్లి ఎమ్మార్వో కార్యాలయానికి చెందిన సర్వేయర్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ రూపొందించిన నివేదికను కూడా సమర్పించాలని నిర్దేశించింది. ప్రభుత్వ శాఖలు దానికి సంబంధించిన ఆధారాలను సమర్పించడంలో తగిన చొరవ చూపడం లేదని, అందువల్ల ఎఫ్‌టీఎల్‌ జోన్‌లో నిర్మాణాలకు సంబంధించి తాజా ఆధారాలను ఫొటోలతో సహా సమర్పించాలని ఆదేశించింది.


బాచుపల్లిలో సర్వే నం.127/పీ, 128/పీ, 137/పీల్లో కోమటికుంట ఎఫ్‌టీఎల్‌ ప్రాంతంలో వాసవి ఇన్‌ఫ్రా ఎల్‌ఎల్‌పీ 8, 9 బ్లాక్‌ల నిర్మాణాలు చేపట్టినా అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్‌ చేస్తూ నిజాంపేటకు చెందిన ఎ.సతీష్‌ అనే వ్యక్తి హైకోర్టులో చేశారు. దీంతోపాటు తమ నిర్మాణాలను నిలిపివేస్తూ హెచ్‌ఎండీఏ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ వాసవి ఇన్‌ఫ్రా ఎల్‌ఎల్‌పీ పిటిషన్‌ దాఖలు చేసింది. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. వాసవి తరఫు సీనియర్‌ న్యాయవాది బి.మయూర్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అన్ని అనుమతులు తీసుకున్నాకే 12 బ్లాక్‌లతో నిర్మాణాలు కొనసాగిస్తున్నామన్నారు. ఎఫ్‌టీఎల్‌లో 8, 9 బ్లాక్‌లు ఉంటున్నాయన్నదే ప్రధాన ఆరోపణ అని అన్నారు. దీనికి సంబంధించి సర్వే పూర్తయిందని, నిర్మాణాలు బఫర్‌జోన్‌లో జరగడం లేదని నివేదిక వచ్చిందన్నారు. ఒకవేళ బఫర్‌జోన్‌లో ఈ రెండు బ్లాక్‌ల నిర్మాణం జరిగిందని తేలితే తామే కూల్చివేస్తామని హామీ ఇస్తామన్నారు.


పిటిషనర్‌ తరఫు న్యాయవాది టి.వెంకటరాజుగౌడ్‌ వాదనలు వినిపిస్తూ ఇటీవల కూడా జీహెచ్‌ఎంసీ అధికారుల బృందం పరిశీలించి వాసవి నిర్మాణాలు ఎఫ్‌టీఎల్‌లో ఉన్నాయని స్పష్టమైన నివేదిక ఇచ్చిందన్నారు. వాదనలను విన్న ధర్మాసనం ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలంటూ విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com