తెలంగాణలో గత వారం రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంది. సూర్యుడి దర్శనభాగ్యమే కలగటం లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయన్నారు.
ఇటీవలే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిశాయి. ప్రస్తుతం మరోసారి అల్పపీడనం ఏర్పడటంతో వర్షాలు కురుస్తాయన్నారు. రాగల 24 గంటలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మెదక్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది. హైదరాబాద్ నగరంతో పాటు మిగిలిన మరి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వర్షం కురిసే సమయంలో అత్యవసరమైతే బయటకు వెళ్లొద్దని సూచించారు. పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉన్నందున చెట్ల కింద ఉండకూడదని చెప్పారు.
ఇక వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు నిండు కుండలా మారాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. గురువారం (జులై 25) కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యధికంగా 4.8 సెం.మీ వర్షపాతం నమోదైందనిట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురుతో ఉద్యోగులు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ ముసురు మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగుతుందని వాతావరణశాఖ వెల్లడించింది.