ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 08, 2024, 07:28 PM

ఎప్పుడెప్పుడా అని ఏళ్లుగా ఎదురుస్తున్న వారి కల నిజమైంది. నిజాయితీతో సమాజం కోసం పని చేసే ఆ కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. జవహార్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్‌ హౌసింగ్ సొసైటీ సభ్యులకు రేవంత్ రెడ్డి సర్కార్ ఇళ్ల స్థలాల పట్టాలు విడుదల చేసింది. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో.. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. 1100 మంది జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పట్టాలను ప్రభుత్వం విడుదల చేసింది. బషీర్‌బాద్‌లో 38 ఎకరాల భూమిపత్రాలను ప్రభుత్వం అందజేసింది. ఇళ్ల స్థలాల పట్టాలు పొందిన వారిలో సీఎం రేవంత్ రెడ్డి పీఆర్ఓ అయోధ్య రెడ్డి కూడా ఉండటం గమనార్హం. అయితే.. ఈ సొసైటీలోని జర్నలిస్టులకు స్థలాల కేటాయింపు ఏళ్ల తరబడి కోర్టులో ఉండగా.. నేటికి వారి కల నెరవేరింది. అయితే.. ప్రస్తుతం ఆ సొసైటీలోని పలువురు జర్నలిస్టులు మరణించటం బాధాకరం.


ఈ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రస్తుతమున్న మీడియాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చాలా మీడియా సంస్థలు పుట్టుకొచ్చాయని.. అందులో రాజకీయ నేతలకు పనిచేసేవే ఎక్కువగా ఉన్నాయని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అసలైన జర్నలిస్టులు వీళ్లే అని ఎలా గుర్తించాలో చెప్పాలంటూ.. కార్యక్రమంలో పాల్గొన్న పాత్రికేయులను ప్రశ్నించారు. చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్ల వాళ్లు కూడా తాము జర్నలిస్టులమంటూ వచ్చి ఇష్టారీతిన మాట్లాడుతుండంటంతో.. జనాల నుంచి వస్తున్న స్పందనను.. జర్నలిస్టులందరి మీద దాడిలా మార్చేస్తున్నారని వివరించారు. జర్నలిస్టులమని చెప్పుకునే కొంతమంది రాజకీయ కార్యకర్తలు చేస్తున్న పనికి ఫలితంగా జనాలు చేస్తున్న దాడులను.. జర్నలిస్టులందరి మీద జరుగుతున్నట్టుగా భావించొద్దని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అసెంబ్లీలోకి గానీ.. మంత్రుల దగ్గరికి గానీ.. ఎలాంటి అర్హత ఉన్న వారిని పంపించాలన్న అంశంపై కొన్ని విధివిధానాలు రూపొందించి ఇస్తే.. దాన్ని కేబినెట్‌లో చర్చించి చట్టబద్దత తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.


మరోవైపు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పలు విషయాలను ప్రస్తావించారు. జిల్లాలు, మండలాల్లో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు ఎలాంటి ఇబ్బందులు లేవని.. కానీ హైదరాబాద్‌లో ఉన్న మీడియా వాళ్లకే చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అర్హులైన అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 2016 అక్రిడేషన్ రూల్స్‌లో చాలా పొరపాట్లు దొర్లాయని అభిప్రాయపడ్డారు. అక్రిడేషన్ జారీకి భాషా, కులం, మతంతో సంబంధం ఉండకూడదన్నారు. సర్క్యులేషన్ ప్రాతిపదికన పత్రికలను చూడాలన్నారు.


నిబంధనలు పాటిస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు వచ్చేలా ప్రయత్నం చేస్తామని శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. అక్రిడేషన్ కార్డులు అమ్ముకుంటున్నారని... దాని వల్ల పరువుపోతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రిడేషన్ కార్డు చూపించి కొందరు సామాన్యులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు. ప్రెస్ అకాడమీ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించాలని.. నైతిక ప్రమాణాలు పెంచాలన్నారు. రెండు మూడు రోజులు శిక్షణ తరగతులు పెట్టాలని.. సెమినార్స్, వర్క్ షాప్స్ నిర్వహించాలని శ్రీనివాస్ రెడ్డి సూచించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com