ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొమురవెల్లి మల్లన్న గుడికి మహిళా అఘోరి.. దిగబరంగానే ఆలయానికి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 08, 2024, 10:17 PM

సాధారణంగా.. అఘోరాల గురించి వింటుంటాం. శివునిపై అపారమైన భక్తితో ఆ దిగంబరునికి తమ జీవితాన్ని అకింతం చేస్తుంటారు. బంధాలు, బందుత్వాలను వదిలేసే.. శివ నామ స్మరణలో లీనమైపోతుంటారు. కాశీలాంటి శైవక్షేత్రాల్లో లేదా హిమాలయాల్లో అఘోరాలు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఒళ్లంతా విభూదితో.. రుద్రాక్ష మాలలతో.. జటాజూటాలతో.. తపస్సులో నిమగ్నమైపోతుంటారు. వీళ్ల జీవనశైలి కూడా సాధారణ మనుషులకు భిన్నంగా ఉంటుంది. కొందరు అఘోరాలు ఒంటికి బట్టలు చుట్టుకుంటే.. మరికొందరు మాత్రం దిగంబరులుగానే ఉంటారు. అయితే.. ఇదంతా మనకు తెలిసిందే. కానీ.. అఘోరాల్లో మగవాళ్లే కాదు.. మహిళా అఘోరిలు కూడా ఉంటారన్నది.. ఇప్పుడు అసలు చర్చ.


ఎక్కడో కాశీలోనో, హిమాలయాల్లోనో ఉంటే.. అంతపెద్ద చర్చ కాదు కానీ.. ఓ మహిళా అఘోరి తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన కొమురవెల్లి మల్లన్న ఆలయం పరిసరాల్లో కనిపించటమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఎక్కడెక్కడి నుంచో శివుని భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు. గుట్ట మీద ఓ బండ సొరికలో వెలసిన మల్లన్న.. మహిమాన్వితునిగా, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా తెలంగాణ ప్రజలు నమ్ముతుంటారు. ఈ క్రమంలోనే.. సెప్టెంబర్ 5వ తేదీన కొమురవెల్లి మల్లన్న ఆలయానికి ఓ మహిళా అఘోరి విచ్చేసింది.


ఓ కారులో వచ్చిన ఆ మహిళా అఘోరిని చూసి అక్కడున్న భక్తులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇప్పటివరకు మగవారే అఘోరాలుగా ఉండటం చూసిన ప్రజలు.. అకస్మాత్తుగా మహిళా అఘోరిని చూడటంతో అవాక్కవటం వారి వంతైంది. అయితే.. ఆ మహిళా అఘోరి.. దిగంబరురాలిగా రావటం గమనార్హం. ఒళ్లంతా విభూది ధరించి.. మెడలో, చేతులకు రుద్రాక్షల మాలలతో, చేతిలో త్రిశూలంతో.. ఎలాంటి దుస్తులు ధరించకుండా దిగంబరావతారంలో ఆ అఘోరి కనిపించటంతో.. అందరూ ఆశ్చర్యపోయారు.


ఆ ఆఘోరి వచ్చిన వాహనం (కారు) కూడా ఆమె ఫొటోలతో, శివుని పోస్టర్లతో కొంచెం వింతగానే ఉంది. ఒక్కసారిగా ఆ అఘోరిని చూసిన స్థానికులు, భక్తులు ఆమెను వింతగా చూడగా.. కొందరు ఆమె కదలికలను వీడియో తీయగా.. ఇప్పుడు అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే.. వీరిని అఘోరాలనే కాకుండా నాగసాధువులు అని కూడా పిలుస్తుంటారు.


సాధారణంగా.. అఘోరాలను పలు తెలుగు సినిమాల్లో చూస్తుంటాం. ఇటీవల నటసింహం బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ సినిమాలో ఆయన అఘోరగా నటించారు. రామ్ పోతినేని నటించిన ఇస్మార్ట్ శంకర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాల్లోని క్లైమాక్స్‌ల్లోనూ భారీగా అఘోరాలు కనిపిస్తారు. ఇక విశ్వక్ సేన్ నటించిన గామి సినిమాలోనూ అఘోరాలు కనిపిస్తారు. మొత్తంగా అఘోరాలంటే.. కాశీలో, లేదా హిమాలయాల్లో ఉంటారని సినిమాల్లో చూపిస్తారు. కాగా.. ఇప్పుడు ఒక్కసారిగా కొమురవెల్లిలో కనిపించటంతో.. భక్తులు ఆశ్చర్యపోయారు.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com