ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి నుంచి గ్రూప్-1 మెయిన్స్.. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163, సుప్రీం తీర్పుపై ఉత్కంఠ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 09:52 PM

తెలంగాణలో గ్రూప్-1 పోస్టులకు నేటి నుంచి మెయిన్స్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఈనెల 27 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని 46 పరీక్ష కేంద్రాల్లో మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు వాయిదా వేయాలంటూ కొందరు అభ్యర్థులు నిరసనలు చేస్తున్న నేపథ్యంలో ఆయా పోలీసు కమిషనర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో భారీ బందోబస్తు సిద్ధం చేశారు. ప్రతి కేంద్రం వద్ద ఒక ఎస్సై ఆధ్వర్యంలో మహిళా కానిస్టేబుల్‌ సహా మొత్తం ఆరుగురు కానిస్టేబుళ్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు.


ఎగ్జామ్ రూమ్, చీఫ్ సూపరింటెండెంట్, పరిసర ప్రాంతాల్లో CC కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల వరకు ఐదుగురికి మించి ఉండకుండా పోలీసులు BNSS 163 సెక్షన్ విధించారు. పరీక్షలకు సంబంధించి రోజూ క్వశ్చన్ పేపర్, ఆన్సర్ షీట్స్ తరలించే జీపీఎస్‌ అమర్చిన వాహనాలు నిర్దేశిత మార్గాల్లోనే ప్రయాణించేలా రూట్‌మ్యాప్‌ రూపొందించారు. అభ్యర్థులను డోర్‌ ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్‌ (డీఎఫ్‌ఎండీ)లతో తనిఖీ చేశాకే అనుమతించనున్నారు.


కాగా మెుత్తం 563 గ్రూప్‌-1 పోస్టులు భర్తీ చేయనుండగా.. ఈ పరీక్షలకు 31,383 మంది హాజరు కానున్నారు. గ్రూప్-1 మెయిన్స్ వాయిదా, జీవో 29 రద్దు కోసం అభ్యర్థులు గత కొన్ని రోజులుగా పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారు. వారి ఆవేదనను లెక్కచేయని ప్రభుత్వం యథావిధిగా నేటి నుంచి పరీక్షలు జరుగుతాయని ప్రకటించింది. ఇదిలా ఉండగా.. గ్రూప్-1 విద్యార్థుల పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది.


ప్రిలిమ్స్ స్టేజ్‌లో రిజర్వేషన్ పాటించకపోవటాన్ని కొందరు అభ్యర్థులు సవాల్ చేశారు. జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అందరికీ వర్తింపజేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఓపెన్ కేటగిరీలో మెరిట్‌తో అర్హత పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను రిజర్వేషన్ కేటగిరిగా పరిగణించడం పట్ల అభ్యంతరం చేస్తున్నారు. ఫలితంగా తక్కువ మెరిట్ ఉన్న రిజర్వ్‌డ్ విద్యార్థులు రిజర్వేషన్‌ అందుకోలేకపోతున్నారన్నారు. సుప్రీంకోర్టు గత తీర్పులకు ఇది వ్యతిరేకమని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే సుప్రీం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com