ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధరణి పోర్టల్ నిర్వహణ ఎన్ఐసీకి అప్పగింత.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2024, 06:57 PM

సంచలన నిర్ణయాలతో పాలనలో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి సర్కార్.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ నిర్వాహణ బాధ్యతలను.. ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్) కి అప్పగిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వ‌ర‌కు టెరాసిస్ ప్రైవేటు సంస్థ నిర్వహిస్తున్న ధ‌ర‌ణి పోర్టల్ నిర్వహ‌ణ బాధ్యత‌ల‌ను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్‌ఐసీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.


అయితే.. మూడేళ్ల పాటు ఈ పోర్టల్ నిర్వహ‌ణ‌ బాధ్యతలను ఎన్ఐసీకి అప్పగిస్తూ ఒప్పందం చేసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్ఐసీ ప‌నితీరు బాగుంటే మరో రెండేళ్లు నిర్వహ‌ణ బాధ్యత‌ల‌ను పొడిగించ‌ుకునే వెసులుబాటును కూడా కల్పిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. టెరాసిస్ నుంచి ఎన్ఐసీకి అప్పగించ‌డం ద్వారా దాదాపు కోటి రూపాయ‌ల నిర్వహ‌ణ భారం కూడా త‌గ్గుతుంద‌ని రెవెన్యూ అధికారులు వెల్లడించారు. అయితే ధ‌ర‌ణి పోర్టల్‌కు చెందిన సాంకేతిక అంశాల‌ను ఎన్ఐసీకి న‌వంబ‌రు 30వ తేదీ వ‌ర‌కు టెరాసిస్ సంస్థ సిబ్బంది పూర్తి స్థాయిలో బదలాయించనుందని రెవెన్యూ ప్రిన్సిప‌ల్ సెక్రట‌ర్ న‌వీన్ మిట్టల్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.


ఇదిలా ఉంటే.. ధరణి పోర్టల్‌ స్థానంలో భూమాత పేరుతో పోర్టల్‌ ఏర్పాటుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ధరణి పోర్టల్‌ను ప్రైవేటు సంస్థ నుంచి ప్రభుత్వ ఎన్‌ఐసీకి బదలాయింపు ప్రక్రియను ప్రభుత్వం ఇటీవే పూర్తిచేసింది. ఇక పేరు మార్చటమే తరువాయిగా తెలుస్తోంది. ధరణి పోర్టల్‌లో ఉన్న పెండింగ్‌ దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించగా.. దాదాపు పరిష్కరించినట్టు తెలుస్తోంది. కొత్త చట్టంతో ముడిపడి ఉన్న అంశాలకు సంబంధించిన దరఖాస్తులే మిగిలిపోయినట్లు అధికారులు చెప్తున్నారు.


కాగా.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ధరణి పోర్టల్‌ను తీసుకురాగా.. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకుని రాజకీయ పార్టీల నేతలు.. భూములు ఆక్రమించుకున్నారంటూ ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. మరోవైపు.. భూతగాదాలు కూడా పెరిగిపోయాయని.. వాటికి సంబంధించిన వివాదాలు గుట్టుగుట్టలుగా పెండింగ్‌లో పడ్డాయంటూ విమర్శలు వచ్చాయి. కాగా.. ఈ ధరణి పోర్టల్‌ నిర్వాహణను ప్రైవేటు సంస్థకు ఇవ్వటం ద్వారా.. ప్రజలకు సంబంధించిన సమాచారానికి గోప్యత లేకుండా పోయిందని.. దీని వల్ల చాలా అక్రమాలకు ధరణి పోర్టల్ కారణమైందంటూ ఆరోణపలు వెల్లువెత్తాయి.


అయితే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణిని బంగాళఖాతంలో కలిపేస్తామంటూ ఎన్నికల్లో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. కాగా.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ధరణి పోర్టల్ నిర్వాహణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే పెండింగ్ ఉన్న వివాదాలను పరిష్కరించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే.. ధరణి పోర్టల్ నిర్వహాణను ఎన్ఐసీకి అప్పగించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com