ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2024, 09:52 PM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూసీ కూల్చివేతలకు తాను సపోర్ట్ చేస్తున్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ.. కేటీఆర్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించి స్థానికుల ఇబ్బందులు అడిగి తెలుసుకుంటే.. దానికి కూడా బీజేపీపై బురదజల్లే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. హైడ్రా, మూసీ ప్రాజెక్ట్ వ్యవహారాలు రెండూ ఒకటేనా అనేది.. అమెరికాలో చదువుకుని వచ్చానని చెబుతున్న కేటీఆర్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలుసుకోవాలని హితవు పలికారు.


మంగళవారం (అక్టోబర్ 22న) రోజు ఉదయం.. అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గంలోని గోల్నాక, కృష్ణా నగర్ ప్రాంతాల్లోని మూసీ పరివాహక ప్రాంతంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, మాజీ మంత్రి కృష్ణాయాదవ్, బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎన్.గౌతమ్‌రావు తదితరులతో కలిసి ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు. ఆయా ప్రాంతాల్లోని స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు.. కేటీఆర్ మీద తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ తన మాటలతో ఆందోళనలో ఉన్న ప్రజలను మరింత అయోమయంలో పడేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


రాజకీయాలు మాట్లాడుతూ ఒకరిపై మరొకరు బురద జల్లుకునేందుకు ఇది సమయం, సందర్భం కాదని... చేతనైతే పేదల ప్రజల పక్షాన నిలబడదామంటూ కేటీఆర్‌కు పిలుపునిచ్చారు రఘునందన్ రావు. అంతే తప్ప.. రఘునందన్ రావు హైడ్రాకు మద్దతుగా మాట్లాడాడంటూ లేనిపోనివి చెప్తూ.. బురద జల్లేందుకు ప్రయత్నిస్తే.. మూసీ విషయంలో నువ్వు, నీ అయ్య మాట్లాడిన వీడియోలు బయటపెడితే సిగ్గుతో తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి వస్తుందంటూ హెచ్చరించారు. మూసీపై మీరు అప్పుడు మాట్లాడిన వీడియోలు బయటపెట్టమంటావా అంటూ కేటీఆర్‌ను రఘునందన్ రావు ప్రశ్నించారు.


మూసీ గురించి మొదటగా మాట్లాడింది, ఇండ్లకు మార్కింగ్ చేసింది.. కాలేరు వెంకటేశ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతేనని రఘునందన్ రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ శుద్ధి పేరుతో మార్కింగులు చేసినప్పుడు కాలేరు వెంకటేశ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లపైకి ఒక్క జేసీబీ వచ్చినా.. వాటికి అడ్డుగా బీజేపీ కార్యకర్తలు నిలబడతారని.. ఒక్క ఇళ్లు కూడా తొలగించకుండా చూస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు.


అధికారంలో ఉన్నప్పుడు ఇండ్లు తొలగిస్తామంటూ మార్కింగులు చేసిన బీఆర్ఎస్ నాయకులు.. ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతూ తన పేరు వాడుకుంటున్నారని రఘునందన్ రావు మండిపడ్డారు. ప్రభుత్వం ఏ రకమైన మార్కింగ్ చేసినా పేదల ఇండ్లను తొలగించకుండా ఉండేందుకు బీజేపీ కార్యకర్తలు చివరి శ్వాస వరకు పోరాటం చేస్తారని రఘునందన్ రావు భరోసా ఇచ్చారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com