ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీరులో బల్లి అవశేషాలు, అవాక్కైన మందుబాబు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2024, 06:58 PM

సాధారణంగా బాధ వచ్చినా, సంతోషం వచ్చినా మద్యం అలవాటు ఉన్నవారు మందెయ్యాల్సిందే. ఇక కొందరు రెగ్యులర్‌గా తాగుతూనే ఉంటారు. అయితే ఇద్దరు, ముగ్గురు స్నేహితులు గానీ, బంధువులు గానీ కలిశారంటే చాలు.. సిట్టింగ్ వేయాల్సిందే. అలాగే ఓ ఇద్దరు వ్యక్తులు మందు పార్టీ చేసుకోవాలి అనుకున్నారు. అనుకున్నదే తడవుగా దగ్గర్లో ఉన్న వైన్ షాప్‌కు వెళ్లి కావాల్సిన మద్యం, బీర్లు తెచ్చుకున్నారు. ఇక సిట్టింగ్ వేసి తాగుదామని కూర్చోగా.. అందులో ఓ వ్యక్తి బీర్ తాగేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో ఆ బీర్‌ తేడా కొట్టింది. దీంతో ఆ సీసాను పైకెత్తి చూసి అవాక్కయ్యాడు. అందులో బల్లి అవశేషాలు చూసి షాక్ అయ్యాడు. వికారాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్‌ జిల్లా ధారూర్‌ మండలం కేరెల్లి గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి, అనంతయ్య ఇద్దరూ మందు పార్టీ చేసుకోవాలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ధారూర్ మండల కేంద్రానికి వెళ్లి బీర్లు, మందు కలిపి మొత్తం రూ.4వేల విలువైన మద్యాన్ని కొనుగోలు చేశారు. తర్వాత ఇంటికి వచ్చి తాగుదామనేసరికి.. బీరు బాటిల్‌లో ఏదో తేడాగా కనిపించింది. అదేంటో చూద్దామని.. బాటిల్‌లో చూడగా.. అందులో చనిపోయిన బల్లి కనిపించింది. బడ్వైజర్‌ బీరు బాటిల్లో బల్లి అవశేషాలు చూసి ఒక్కసారిగా వారిద్దరు షాక్ అయ్యారు.


అయితే బీరు బాటిల్‌లో బల్లి చూపించగా.. తమకేమీ సంబంధం లేదని ఆ వైన్‌ షాప్ ఓనర్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. బడ్వెజర్ కంపెనీ నుంచే అలా వచ్చి ఉంటుందని.. దానికి తాము ఏం చేస్తామంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో లక్ష్మీకాంత్‌ రెడ్డికి మరింత కోపం రాగా.. ఆ చనిపోయిన బల్లి అవశేషాలు ఉన్న బీర్‌ బాటిల్‌ వీడియోను తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ కావడంతో.. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన మందుబాబులు మద్యం తాగాలంటేనే భయపడుతున్నారు.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com