ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేటీఆర్‌పై కామెంట్స్.. మంత్రి కొండా సురేఖపై న్యాయస్థానం సీరియస్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2024, 07:38 PM

తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యక్తిగత విషయాలపై సురేఖ చేసిన కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్‌లో కలకలం రేపాయి. దీంతో కేటీఆర్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. తన ప్రతిష్ఠను భంగం కలిగించేలా మంత్రి కొండా సురేఖ కామెంట్స్ చేశారని.. రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో విచారణ చేపట్టిన నాంపల్లి సిటీ సివిల్ కోర్టు.. మంత్రి కొండా సురేఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేటీఆర్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయంది. ప్రభుత్వంలో భాగమస్వామ్యమై.. ఓ బాధ్యత గల మహిళ మంత్రి ఇలాంటి కామెంట్స్ చేయటం ఆశ్చర్యాన్ని కలిగించిందని పేర్కొంది.


భవిష్యత్‌లో ఇంకెప్పుడూ కేటీఆర్‌పై ఇటువంటి కామెంట్స్ చేయవద్దని మంత్రి కొండా సురేఖను మందలించింది. ఓ వ్యక్తి ప్రతిష్ఠను దిగజార్చేలా అత్యంత జుగుప్సాకరంగా ఉన్న మంత్రి సురేఖ కామెంట్స్‌ను మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా, వెబ్ సైట్ల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కామెంట్స్‌ ఉన్న వీడియోలు, కంటెంట్ తొలగించాలని యూట్యూబ్, ఫేస్‌బుక్, గూగుల్ సంస్థలను కూడా న్యాయస్థానం ఆదేశించింది. మంత్రి కొండా సురేఖ అనుచిత కామెంట్స్ ప్రసారం చేసిన, కథనాలు ప్రచురించిన మీడియా సంస్థలకు కూడా సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మంత్రి కామెంట్లకు సంబంధించిన అన్ని కథనాలను తొలగించాలని చెప్పింది. కొండా సురేఖ కామెంట్స్ సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయని పేర్కొంది. ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన అన్ని కథనాలు, వీడియోలు పబ్లిక్ డొమైన్‌లో ఉండటానికి వీల్లేదని చెప్పింది.


కాగా, పరువు నష్టం కేసులో మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై న్యాయస్థానం ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయటం ఇదే తొలిసారని బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొంటున్నారు. దేశంలో ఈ స్థాయిలో కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేయాలని ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గతంలోనూ కొండా సురేఖ ఇలాంటి కామెంట్స్ చేశారని.. ఎన్నికల సంఘం ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిందని గుర్తు చేస్తున్నారు. ఆయనప్పటికీ మంత్రి కొండా సురేఖ తీరు మారలేదని మండిపడుతున్నారు. కాగా, తన వ్యక్తిత్వ హననం, ప్రతిష్ఠను దిగజార్చే విధంగా ఏ ఆరోపణలు చేసినా సహించేది లేదని ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తాజాగా కోర్టు వ్యాఖ్యలతో కేటీఆర్‌కు బలం చేకూరినట్లైంది. కాగా, నాగార్జున కుటుంబంపై కూడా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేయగా.. ఆయన కూడా పరువునష్టం దావా వేశారు.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com