ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2024, 10:26 PM

గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో ఆహార కల్తీ కేసులు పెరుగుతున్నాయి. కల్తీ ఆహారం తిన్న పలువురు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇటీవల సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో షవర్మా తిన్న ఐదుగురు యువకులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. అల్వాల్‌ ప్రాతంలోని గ్రిల్‌ హౌజ్‌ హోటల్‌లో షవర్మా తిన్న నలుగురు యువకులు సైతం ఆసుపత్రుల పాలు కావాల్సి వచ్చింది. కొంతమందికి బ్లడ్ టెస్టులు చేయగా.. వారు తిన్న ఆహారంలో హానికర సాల్మనెల్లా బాక్టీరియా ఉన్నట్లు డాక్టర్లు తేల్చారు. షవర్మ తినటానికి డిప్ చేసుకొనే మయోనైజ్‌ నాసిరకంగా ఉండటమే ఇందుకు కారణంగా గుర్తించారు.


ఈ వరుస ఆహార కల్తీ ఘటనలతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఉడికించని పదార్థమైనందున .. మయోనైజ్‌లో హానికర బాక్టీరియా తక్కవ కాలంలోనే విపరీతంగా వృద్ధి చెందుతుందని అధికారులు గుర్తించారు. ఆ పదార్థాన్ని నిషేధించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు తాజాగా రేవంత్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దానికి బదులుగా వెజిటెబుల్ పదార్థాలతో చేసే మయోనైజ్‌ను ప్రోత్సహించాలని సర్కారుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.


సికింద్రాబాద్‌ ఈస్ట్‌ మెట్రో స్టేషన్‌లోని ఓ హోటల్‌లో, చాంద్రాయణగుట్ట, కాటేదాన్, టోలిచౌకి, బంజారాహిల్స్‌లోని పలు హోటళ్లలోని షవర్మ, మండి బిర్యానీ, బర్గర్లపైనా ఇటీవల జీహెచ్‌ఎంసీకి వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో తనిఖీలు చేపట్టిన జీహెచ్‌ఎంసీ ఫుడ్ సెఫ్టీ అధికారులు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ హోటళ్లు, పబ్బులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో నాసిరకం మయోనైజ్‌ను గుర్తించారు. దీంతో ఆ పదార్థాన్ని బ్యాన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.


మయోనైజ్‌ను గుడ్డులోని పచ్చసొన, నూనె, నిమ్మరసం, ఉప్పుతో తయారు చేస్తారు. దీన్ని మండి బిర్యానీ, కబాబ్‌లు, శాండ్‌విచ్‌లు, పిజ్జాలు, బర్గర్లు, షవర్మా ఇతరత్రా ఆహార పదార్థాల్లో చెట్నీలా డిప్ చేసుకొని తింటారు. అయితే చాలామంది హోటల్ నిర్వాహకులు మయోనైజ్ తయారీలో ఏమాత్రం శుభ్రతను పాటించడం లేదు. కొన్ని గుడ్లపై ఉండే దూళి, పెంట వంట మనిషి చేతులకు అలాగే అంటుకుంటుంది. గుడ్డును ఇతర ముడి పదార్థాలను తీసుకుని సొనలో కలుపుతారు.


అలా శుభ్రత లేకుండా తయారైన మయోనైజ్‌ చాలా ప్రమాదకరమని జీహెచ్‌ఎంసీ ఫుడ్ సెఫ్టీ అధికారులు చెబుతున్నారు. పరిశుభ్రంగా తయారైన మయోనైజ్‌ను మాత్రమే తినేందుకు ఉపయోగించాలని అంటున్నారు. మయోనైజ్ తయారైన 3-4 గంటల్లోపు దాన్ని ఉపయోగించాల్సి ఉంటుందని.. అలా కాకుండా చాలా మంది రాత్రి తయారు చేసి మరుసటి రోజు వినియోగిస్తున్నట్లు అధికారులు చెప్పారు. అందుకే మయోనైజ్ పదార్థాన్ని బ్యాన్ చేయాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com