రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు.. క్లియరెన్స్ లభించింది. అటవీ అనుమతులను మంజూరు చేయాల్సిందిగా.. కేంద్ర అటవీ – పర్యావరణ మంత్రిత్వశాఖ శాఖకు.. అటవీ సలహా కమిటీ సిఫారసు చేసింది. గత నెల 15న భేటీ అయిన ఈ కమిటీ ప్రాజెక్టుకు సంబంధించి ఎనిమిది జిల్లాల పరిధిలో ఉన్న ఎనిమిది ఫారెస్టు డివిజన్లకు చెందిన 3వేల168.131 హెక్టార్ల అటవీ భూములను వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిపై చర్చించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సాగు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ కే జోషి, కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ హరిరాం హాజరై కమిటీ సభ్యులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు. అటవీ సలహా కమిటీకి కేంద్ర అటవీ విభాగం డైరెక్టర్ జనరల్ సిద్ధాంత్దాస్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అటవీ అనుమతులు ఇవ్వాలని కమిటీ అధికారికంగా మినిట్స్ లో స్పష్టం చేసింది. కమిటీలోని సభ్యులు తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన డాక్యుమెంట్లను అధ్యయనం చేసి తమ సమ్మతిని తెలిపారు.