టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనత సాధించాడు. జొహెన్నెస్బర్గ్ టెస్టులో రాణించిన కోహ్లి 12 రేటింగ్ పాయింట్లను మెరుగుపర్చుకుని 912 పాయింట్లను ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఆట్ టైం ర్యాంకింగ్స్లో బ్రియాన్ లారాను దాటేశాడు. కోహ్లి ప్రస్తుతం 26వ స్థానానికి చేరుకున్నాడు. భారత్ తరఫున అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన సునీల్ గావస్కర్ (916 పాయింట్లు)కు మరింత చేరువయ్యాడు. ఆల్ టైం హై పాయింట్ల పట్టికలో ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్మ్యాన్ 964 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో నంబర్ 1 స్థానంలో ఉన్న స్టీవ్ స్మిత్ 947 పాయింట్లతో ఆల్ టైం హై పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో 153 పరుగులు సాధించడం ద్వారా విరాట్ కోహ్లి 900 పాయింట్ల మార్క్ను అందుకున్నాడు. గావస్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పాడు. సౌతాఫ్రికాతో జరిగిన చివరి టెస్టులో 54, 41 పరుగులు చేసిన విరాట్ 12 పాయింట్లను మెరుగుపర్చుకున్నాడు. దీంతో లారా (911), కెవిన్ పీటర్సన్ (909), హషీమ్ ఆమ్లా (907), చంద్రపాల్ (901), మైకెల్ క్లార్క్ (900)లను కోహ్లి దాటేశాడు.
జొహెన్నెస్ బర్గ్లో 86 పరుగులతో నాటౌట్గా నిలిచిన సఫారీ ఆటగాడు డీన్ ఎల్గర్ రెండు స్థానాలు ఎగబాకి 12వ స్థానానికి చేరుకున్నాడు. ఆఖరి టెస్టులో చోటు దక్కించుకుని రెండో ఇన్నింగ్స్లో కీలకమైన 48 పరుగులు చేసిన అజింక్య రహానే ఐదు స్థానాలు ఎగబాకి 18 స్థానానికి చేరుకున్నాడు. ఆల్రౌండర్ల జాబితాలో భువనేశ్వర్ కుమార్ 12వ స్థానానికి చేరుకోగా, షమీ 17వ స్థానానికి చేరుకున్నాడు.