ప్రేమికుల దినోత్సవం పురస్కరించుకొని కేవలం ఆరుగంటల్లో 2,501మందికి రక్తపరీక్షలు నిర్వహించి సరికొత్త రికార్డు నెలకొల్పింది ఓ సామాజిక సంస్థ. మధ్య ప్రదేశ్లోని భికాంగాన్ పట్టణానికి చెందిన లక్ష్యవారియర్ సామాజిక సంస్థ ఆరుగంటల్లోనే ఇంత మందికి రక్తపరీక్షలు నిర్వహించి, ఇంతకు మునుపు కాలిఫోర్నియాలో 1,460మందితో నమోదై ఉన్న రికార్డును చెరిపేసిందని గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆసియా హెడ్ మనీశ్ వైష్ణోయ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 2,501మందికి లక్ష్య పరివార్ సంస్థ రక్తపరీక్షలు నిర్వహించిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం మొత్తాన్ని వరల్డ్ రికార్డ్ టీమ్ తమ కెమెరాల్లో నిక్షిప్తం చేసిందని ఆయన అన్నారు.
రికార్డుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించిన అనంతరం సంస్థ కన్వీనర్ చందనా శర్మ మాట్లాడుతూ ప్రేమికుల దినోత్సవం రోజు ఓ మంచిసందేశాన్ని సమాజానికి పంపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఇందులో భాగంగానే తలసేమియా బాధితుల కోసం 260మంది రక్తదానం చేశారని చెప్పారు. యువత దీని నుంచి స్ఫూర్తి పొందాలని ఆకాంక్షిస్తున్నామని, పరీక్షలకు హాజరైనవారందరికీ వారి బ్లడ్గ్రూప్ తెలియజేశామని ఆయన వివరించారు.