లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారిక నివాసం ముందు ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. యూపీ ప్రభుత్వం ఇవాళ బడ్జెట్ ప్రవేశపెడుతున్న తరుణంలోనే ఈ సంఘటన చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది. ఎట్టకేలకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సదరు రైతును శాంతింపజేయడంతో కథ సుఖాతమైంది. వివరాల్లోకి వెళితే... యూపీలోని లలిత్పూర్కి చెందిన రామ్రాజ్ ఇవాళ ఉదయం తన కుమారుడితో కలిసి సీఎం అధికారిక నివాసం ఉన్న 5- కాళిదాస్ మార్గ్కు వచ్చాడు. అక్కడే ఉన్న 100 అడుగుల ఎత్తైన చెట్టు ఎక్కి ఉరివేసుకునేందుకు సిద్ధపడ్డాడు.
పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని అతడిని కిందికి దించేందుకు ప్రయత్నించారు. అయితే తనకున్న రూ.1.5 లక్షల రుణం మాఫీ చేస్తానని హామీ ఇస్తేనే కిందికి దిగుతానంటూ రామ్రాజ్ తెగేసిచెప్పాడు. దాదాపు గంటసేపు ఈ హైడ్రామా కొనసాగింది. రుణమాఫీపై అధికారులు హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు రైతు చెట్టు దిగాడు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్కి తరలించారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీ మేరకు... యోగి ప్రభుత్వం గతేడాది రూ.లక్ష లోపు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేసిన సంగతి తెలిసిందే.