అడవిదేవులపల్లి మండలం సత్రశాల సమీపంలోని చెట్ల పొదల్లో సోమవారం ఉదయం రెండు అస్థిపంజరాలను పోలీసులు గుర్తించారు. అస్థిపంజరాలు ఉన్న ప్రాంతంలో చీర, ఇతర దుస్తులు, చెప్పులు, డ్రైవింగ్ లైసెన్స్ లభ్యమయ్యాయి. డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా మృతులు.. గుంటూరు జిల్లాకు చెందిన వారిగా పోలీసులు నిర్ధారించారు. డ్రైవింగ్ లైసెన్స్ పై కోరె అప్పారావు, తండ్రి వెంకటేశ్వర్లు, గంగవరం గ్రామం, గురజాల మండలం, గుంటూరు జిల్లా అని ఉంది.
ఈ అడ్రస్ ఆధారంగా గురజాల పోలీసులకు నల్లగొండ పోలీసులు సమాచారం అందించారు. అయితే గంగవరం గ్రామానికి చెందిన కోరె అప్పారావు, గురజాల గ్రామానికి చెందిన మువ్వా కాసులు, భర్త వెంకటేశ్వర్లు 2018, జనవరి 1వ తేదీన అదృశ్యమైనట్లు గురజాల పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. అదృశ్యమైన ఆ ఇద్దరే వీరు అయి ఉంటారని అడ్రస్ ఆధారంగా పోలీసులు నిర్ధారించారు. అయితే వీరు ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా హత్య చేసి ఇక్కడ పడేసి పోయి ఉంటారా? అన్నది తేలాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.