భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ హెర్షలె గిబ్స్ మధ్య ట్విటర్లో ఆసక్తికర సంభాషణ సాగింది. గిబ్స్ అశ్విన్కు చురక అంటించబోతే.. తిరిగి అశ్విన్ అతడికి గట్టి పంచ్ ఇచ్చాడు. ఒక షూ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న అశ్విన్.. దాని గురించి సానుకూలంగా ఒక ట్వీట్ పెట్టాడు. ఆ సంస్థ షూలు ఎప్పుడెప్పుడు వేసుకుందామా అనిపిస్తోందని వ్యాఖ్యానించాడు. దీనిపై గిబ్స్ సరదాగా స్పందిస్తూ.. ‘‘అశ్విన్.. నువ్వు ఇప్పుడైనా కొంచెం వేగంగా పరుగెత్తుతావని ఆశిస్తున్నా’’ అన్నాడు. అశ్విన్ మైదానంలో నెమ్మదిగా కదులుతాడన్న విమర్శలున్న నేపథ్యంలోనే గిబ్స్ ఆ మాట అన్నాడు. దీంతో అశ్విన్కు మండిపోయింది. గతంలో గిబ్స్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తూ అతను ట్వీట్ పెట్టాడు. ‘‘కచ్చితంగా నేను నీ అంత వేగంగా పరుగెత్తలేను. కానీ మ్యాచ్లు ఫిక్స్ చేయకుండా నైతికతతో ఆడే మనసు మాత్రం నాకుంది’’ అని అశ్విన్ పేర్కొన్నాడు. ఈ ట్వీట్తో నొచ్చుకున్న గిబ్స్.. జోక్ను స్వీకరించలేని అశ్విన్ వేరే అంశంలోకి వెళ్లిపోయాడని వ్యాఖ్యానించాడు. ఐతే తాను కూడా సరదాకే ఆ ట్వీట్ పెట్టానని.. ఏదైనా చూసే వాళ్ల దృష్టిని బట్టే ఉంటుందని అన్నాడు. త్వరలో మనిద్దరం విందుకెళ్దాం అంటూ గిబ్స్ మనసును తేలిక చేసే ప్రయత్నం చేశాడు అశ్విన్.