పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.11,400కోట్ల భారీ మోసానికి పాల్పడ్డ ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆస్తులపై ఎన్ఫోర్సమెంట్ డైరెక్టరేట్ సోదాలు కొనసాగుతున్నాయి. రూ.44కోట్ల విలువ చేసే నీరవ్ బ్యాంకు డిపాజిట్లు, షేర్లను ఈడీ జప్తు చేసింది. అలాగే విదేశాల నుంచి దిగుమతి చేసిన అత్యంత ఖరీదైన వాచ్లను పెద్ద మొత్తంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న ఈడీ నీరవ్, ఆయన మామ ఛీక్సీలకు చెందిన దాదాపు రూ.100కోట్ల విలువైన ఆస్తులను, రోల్స్ రాయిస్ ఘోస్ట్, మెర్స్డెజ్ బెంజ్, పోర్షే పనామెరాతో పాటు తొమ్మిది అత్యంత విలాసవంతమైన కార్లను జప్తు చేసిన సంగతి తెలిసిందే.
పీఎన్బీలో భారీ కుంభకోణానికి పాల్పడ్డ నీరవ్ విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. ఈడీ నుంచి అందిన సమన్ల ప్రకారం నీరవ్ గురువారం ఈడీ ఎదుట హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సి ఉండగా ఆయన హాజరుకాలేదు. తన పాస్పోర్ట్ నిలిపివేయడం, వ్యాపార లావాదేవీల పెండింగ్ వల్ల రాలేకపోతున్నానని వెల్లడించారు. దీంతో అధికారులు ఆయనకు మరో అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఈ నెల 26న ముంబయిలో తమ కార్యాలయంలో హాజరుకావాలని ఈడీ ఆదేశించింది.