హైదరాబాద్ : రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు బడ్జెట్లో పెద్దపీట వేశామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బడ్జెట్ ప్రతులతో తన ఇంటి నుంచి అసెంబ్లీకి బయల్దేరే ముందు ఈటల మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల్లో విశ్వాసం నింపేలా బడ్జెట్ ఉంటుందని తెలిపారు. అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణను తెచ్చుకున్నామని చెప్పారు. ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉండాలనే సంకల్పంతో.. ఏ వర్గాలు అయితే అభివృద్ధి చెందలేదో.. ఆ వర్గాల అభివృద్ధే ఎజెండాగా బడ్జెట్ను రూపొందించడం జరిగిందన్నారు. కుల వృత్తులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 60 ఏళ్ల తర్వాత కూడా ప్రభుత్వాలపై ప్రజలకు విశ్వాసం కలగలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కలిగేలా ముందడుగు వేస్తున్నామని చెప్పారు. అణగారిన వర్గాలకు అండగా ఉండి వారిలో విశ్వాసం నింపాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదరికంలో మగ్గే ప్రజలందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. 2017-18 బడ్జెట్ అణగారిన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా తయారు చేయబడ్డదన్నారు.