ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహా పాదయాత్ర.. ముంబై చేరిన 50 వేల మంది రైతులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 12, 2018, 09:28 AM

పదులు, వందలు కాదు వేలాది మంది రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీయడానికి అకుంఠిత దీక్షతో పాదయాత్రగా సాగి ముంబై నగరానికి చేరుకున్నారు. నాసిక్‌లో మార్చి 6 న ప్రారంభమైన మహారైతు పాదయాత్ర రోజుకు పాతిక కిలోమీటర్లు చొప్పున సాగి 180 కిలోమీటర్ల దూరంలోని రాజధాని ముంబైకి చేరుకుంది. ఆల్ ఇండియా కిసాన్‌ సభ నేతృత్వంలో సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీని ముట్టడించేందుకు వీరంతా కదలివచ్చారు. నాసిక్‌ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రలో వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా భాగస్వామి అయ్యారు. మండుటెండలో ఆకలిదప్పులు లెక్కచేయక దాదాపు 200 కిలోమీటర్లు నడుచుకుంటూ ఆదివారం ముంబయి చేరుకున్నారు.


పంట రుణాలు, విద్యుత్‌ బిల్లులను సంపూర్ణంగా మాఫీ చేయాలని, స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను అమలుచేయాలని ప్రభుత్వాన్ని వీరు డిమాండ్‌ చేస్తున్నారు. వీరి చేతుల్లోని జెండాలతో ముంబయి రోడ్లు ఎరుపు రంగును పులుముకున్నాయి. సోమయ్య మైదానంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక శిబిరాల నుంచి ఆదివారం తెల్లవారుజామున వీరంగా ఆజాద్‌ మైదానానికి తరలివెళ్లారు. నిరసనల నేపథ్యంలో ముంబయి ట్రాఫిక్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. వాహనదారులకు ప్రత్యేక సూచనలు చేశారు. భద్రతా ఏర్పాట్లనూ కట్టుదిట్టంచేశారు. 35 వేల మందితో ర్యాలీ మొదలుపెట్టాం... ఇప్పుడు దీనిలో పాల్గొంటున్న వారి సంఖ్య 50 వేలకు చేరుకుంది... ముంబయి మహానగర వాసులకు ఎలాంటి ఇబ్బందీ కలిగించం. పదో తరగతి పరీక్షలురాసే విద్యార్థుల గురించీ ఆలోచించాం. అందుకే సోమవారం 11 గంటలు దాటిన తర్వాతే ర్యాలీ ప్రారంభిస్తామని ఏఐకేఎస్‌ అధ్యక్షుడు అశోక్‌ ధావ్లే తెలిపారు.


రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి గిరీశ్‌ మహాజన్‌ను ఆదివారం ఉదయం కలిసినట్లు ఆయన వివరించారు. తమ డిమాండ్ల గురించి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌‌ నోటీసుకు తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ రైతు పాదయాత్రకు ప్రతిపక్ష కాంగ్రెస్‌, ఎన్‌సీపీలతోపాటు మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన, శివసేన పార్టీలు కూడా మద్దతు తెలిపాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa