బెంగళూరుకి చెందిన ఓ బోగస్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ భారీగా నష్టపోయారు. విక్రమ్ ఇన్వస్ట్మెంట్ పేరుతో ఉన్న ఈ కంపెనీలో వీరితో పాటు.. దాదాపు 1,776 మంది భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. తక్కువ వ్యవధిలోనే ఎక్కువ ఆదాయం వస్తుందని నమ్మించిన ఈ కంపెనీ.. అందరినీ మోసం చేసి బోర్డు తిప్పేసిందని పోలీసులు వెల్లడించారు. ఇటీవల బాలాజీ అనే బాధితుడు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో.. ఈ కంపెనీ దివాళా విషయం వెలుగులోకి వచ్చింది.
పెట్టుబడులకి మించిన ఆదాయం వస్తుందనే ఆశతో రాహుల్ ద్రవిడ్ భార్య విజేత తన బంధువులతో కలిసి.. దాదాపు రూ. 35 కోట్లు వరకు పెట్టుబడి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు షట్లర్ సైనా కూడా ఈ కంపెనీలో సుమారు రూ. 1.5 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్లు తెలుస్తోంది. ప్రచారంలో క్రికెటర్లు, స్టార్ ప్లేయర్స్ పెట్టుబడులు పెట్టినట్లు చెప్పుకొచ్చిన కంపెనీ.. పెద్ద మొత్తంలో పెట్టుబడుల్ని సేకరించి చివరికి అందరినీ మోసం చేసింది. ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్ భారత అండర్-19 జట్టు కోచ్గా పనిచేస్తుండగా.. బుధవారం రాత్రి జరిగిన ఆల్ ఇంగ్లాండ్ టోర్నీ తొలి రౌండ్లోనే సైనా నెహ్వాల్ ఓటమి చవిచూసింది.