ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు ఈ పథకం గొప్ప వరం : పోచారం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 20, 2018, 10:37 AM

హైదరాబాద్ : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పంట పెట్టుబడి పథకం కింద రైతులందరికీ ఎకరానికి రూ. 4 వేల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచంలో రైతులకు పెట్టుబడి రాయితీ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని చెప్పారు. తెలంగాణ రైతులకు ఇది గొప్ప వరమని ఆయన అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పంట పెట్టుబడి పథకంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. వానకాలం పంటకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి, యాసంగి పంటకు నవంబర్ నుంచి పంట పెట్టుబడి సాయం చేస్తామని మంత్రి ప్రకటించారు. ప్రతి గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా రైతులకు చెక్కుల పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ. 12 వేల కోట్లు ప్రతిపాదించడం జరిగింది. వానకాలం పంట నుంచి ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని మంత్రి ఉద్ఘాటించారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 72 లక్షల 13 వేల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా కూడా ఈ పథకం లేదన్నారు. రైతు వద్ద శిస్తు వసూలు చేయకుండా పంట పెట్టుబడి పథకం అమలు చేస్తున్నాం. ఇది తెలంగాణ రైతాంగానికి గొప్ప వరం. ఆత్మగౌరవంతో రైతులు బతకాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉద్ఘాటించారు. పార్ట్ ఏ కింద ఒక కోటి 12 లక్షల ఎకరాల భూమిని గుర్తించామని తెలిపారు. ఆరు బ్యాంకుల ద్వారా ఆర్డర్లీ చెక్కులను పంపిణీ చేస్తామన్నారు. శనగ, చెరుకు పంటకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. రెండో పంటలకు కూడా పంట పెట్టుబడి కింద సాయం చేస్తామని మంత్రి తెలిపారు. కౌలు రైతులకు ఈ పథకం వర్తించదు అని మంత్రి స్పష్టం చేశారు. ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసించారని మంత్రి పోచారం సభకు తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa