ఇరాక్లోని మొసుల్లో సుమారు 40 మంది భారతీయులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ జూన్ 11, 2014లో కిడ్నాప్ చేసింది. ఆ గ్యాంగ్ నుంచి హర్జిత్ మాషి అనే పంజాబీ వ్యక్తి తప్పించుకున్నాడు. ఇస్లామిక్ ఉగ్రవాదుల చెర నుంచి బయటపడ్డ అతను తిరిగి గురుదాస్పుర్ చేరుకున్నాడు. ఇరాక్లోని బాదుష్ ఎడారి సమీపంలో జూన్ 15న మిగతా 39 మంది భారతీయులను ఇస్లామిక్ స్టేట్ హతమార్చినట్లు గతంలో మాషి చెప్పాడు. మోసుల్లో ఇస్లామిక్ స్టేట్ ప్రాబల్యం ఉన్న ప్రాంతం నుంచి తప్పించుకున్న హర్జిత్ మాషి.. ఆ తర్వాత ఎర్బిల్ బోర్డర్కు చేరుకున్నాడు. అక్కడ అతన్ని భారతీయ కౌన్సులేట్ అధికారులు పికప్ చేసుకున్నారు. అయితే గత ఏడాది కూడా పార్లమెంట్లో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ భారతీయ బంధీలపై ఓ ప్రకటన చేశారు. బంధీల ఆచూకీ లేదని, కానీ వాళ్లు మృతిచెందినట్లు ద్రువీకరించలేమన్నారు. కానీ ఇవాళ చేసిన ప్రకటనలో ఆ బంధీలు మృతిచెందినట్లు సుష్మా స్పష్టం చేశారు.
భారతీయ బంధీల గురించి ఇటీవల మాషి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. 39 మంది భారతీయుల మృతికి తానే కారణమని పోలీసులు తనను అనుమానిస్తున్నారని చెప్పాడు. అదృష్టవశాత్తు తాను ప్రాణాలతో బయటపడ్డ సన్నివేశాన్ని అతను గుర్తు చేసుకున్నాడు. అయితే ఇరాక్ సంయుక్త దళాలు జరిపిన దాడుల్లో మోసుల్ చాలా వరకు ధ్వంసమైంది. బంధీలు ఉన్న బాదుష్ ప్రాంతం కూడా సర్వనాశనమైంది. 2014, జూన్ 12వ తేదీన హర్జిత్ మాషి ఓసారి ఇంటికి ఫోన్ చేశాడు. ఇస్లామిక్ ఉగ్రవాదులు తమను కిడ్నాప్ చేసినట్లు ఫోన్లో అతను చెప్పినట్లు గుర్తు చేశాడు. ఉగ్రవాదుల నుంచి మోసుల్ను స్వాధీనం చేసుకునేందుకు ఇరాక్ సైన్యానికి చాలా సమయం పట్టింది. కానీ ఆ సమయంలో భారతీయ బంధీల ఆచూకీ చిక్కలేదు. ఈ లోపు సుమారు 14 సార్లు ఆ బంధీల కుటుంబీకులు మంత్రి సుష్మాను కలిశారు. అయితే బంధీల నుంచి ఆ తర్వాత కొన్ని ఫోన్ కాల్స్ రావడం వల్ల మాషి అబద్ధం చెబుతున్నారని అనుమానించారు. ఇవాళ పార్లమెంట్లో ఆ మృతుల పట్ల నివాళి అర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa