రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా విద్యుత్ అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఓపెన్ టెండర్ల ద్వారానే విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఎన్టీపీసీ ద్వారా విద్యుత్ కొనుగోలుకు ధర ఎక్కువ చెల్లిస్తున్నామని చెప్పారు. ఎన్టీపీసీ వెల్లూరు నుంచి కొనుగోలు చేస్తే రూ. 5.42 ధర, ఎన్టీపీసీ కొడ్గి నుంచి కొనుగోలు చేసినదానికి రూ. 5.46 ధర చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రయివేటు సంస్థల కంటే ఎన్టీపీసీ వద్ద కొనుగోలుకు ఎక్కువ ధర చెల్లిస్తున్నామని తెలిపారు.
టెండర్ల ద్వారా వెళ్లినా ఈఆర్సీలే ధరలు నిర్ణయించాల్సి ఉంటుందన్నారు. రైతులకు నిరంతర విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వరంగ సంస్థ కూడంకుళం ఎన్టీపీసీని సంప్రదించామని చెప్పారు. ఎన్టీపీసీ కూడంకుళం నుంచి రూ. 10 చెల్లించాలని చెప్పింది. అలాగే మూడు నెలల అడ్వాన్స్ ఇవ్వాలని షరతు పెట్టిందన్నారు. దేశంలో 3 నెలల అడ్వాన్స్ ఇచ్చిన సందర్భాలు ఎక్కడా లేవు అని మంత్రి తెలిపారు. ప్రయివేటు విద్యుత్ సంస్థలు రూ. 4.6 ధరకు ముందుకు వచ్చాయన్నారు. విద్యుత్ కొనుగోలులో కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ముందుకు వెళ్తున్నామని మంత్రి చెప్పారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. కొన్ని పరిశ్రమలకు ప్రభుత్వ బకాయిలు ఉన్నాయనేది వాస్తవమన్నారు. విద్యుత్ బిల్లు చెల్లించకపోతే ప్రభుత్వ కార్యాలయాలను జప్తు చేసిన సందర్భాలు ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు. సౌర విద్యుత్ను ప్రోత్సహించాలనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమన్నారు. ప్రతి రాష్ట్రం ఉత్పత్తి చేసేదాంట్లో నిర్ణీత శాతం సౌరవిద్యుత్ ఉండాలనేది నిబంధన అని మంత్రి తెలిపారు. ఉదయ్ పథకానికి సంబంధించి రాష్ర్టానికి ఎలాంటి లాభం లేదన్నారు. డిస్కమ్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa