ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సెల్ఫ్గోల్ చేసుకుంటుందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. మంత్రి శ్రీనివాస్ యాదవ్ మీడియాతో చిట్చాట్ చేశారు. రిజర్వేషన్ల కోసం టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న పోరాటంలో న్యాయం ఉంది. ఈ విషయంలో టీఆర్ఎస్ను నిందించడం తగదన్నారు. అన్నాడీఎంకే కూడా ఆందోళన చేస్తుంది. ఆ పార్టీ ఎంపీలతో టీడీపీ అవిశ్వాసం మీద మాట్లాడిందా? అని ప్రశ్నించారు. లోక్సభలో బీజేపీకి 273 మంది ఎంపీల బలం ఉంది. అవిశ్వాస తీర్మానంతో వచ్చే ప్రయోజనమేమిటి? అని అడిగారు. ప్రత్యేక హోదా సాధించుకోవడానికి అనేక వేదికలు ఉన్నాయన్నారు.
ఏపీ పార్టీలు అక్కడి ప్రజలను మరోసారి మోసం చేస్తున్నాయి. అక్కడి ప్రజలను అమాయకులను చేసి ఆడుకుంటున్నాయి. తమ దిగజారుడు రాజకీయాలతో ప్రజలను పిచ్చివాళ్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి తలసాని అభిప్రాయపడ్డారు. ఏపీలో ఉన్న మొత్తం 25 ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే ఏదైనా ఫలితం ఉంటుందేమో అని అన్నారు. ప్రజలను గందరగోళ పరచడానికి ఏపీలోని పార్టీలు ఒకరిపై ఒకరు బుదర జల్లుకుంటున్నారని తలసాని ఎద్దెవా చేశారు.
తెలంగాణ ఉద్యమ నేపథ్యం చూసైనా.. ఏపీ పార్టీలు పోరాడటం నేర్చుకుంటే మంచిదని సూచించారు. ఎన్డీఏ నుంచి వైదొలిగాక చంద్రబాబు అవిశ్వాసంపై అన్ని పార్టీలతో మాట్లాడారని మీడియాలో వార్తలు వచ్చాయి. చంద్రబావు తానెవరితో మాట్లాడలేదని ఆ తర్వాత వివరణ ఇచ్చారు. దీంతోనే అక్కడి రాజకీయాలు ఎలా ఉన్నాయో అర్థమవుతుందని మంత్రి అన్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం కేంద్రం మీద ఒత్తిడి పెంచకుండా ఏం చేశారు? అని ప్రశ్నించారు. ఏపీ పార్టీలకు ప్రణాళిక లోపించిందన్న మంత్రి తలసాని.. ఎంపీల రాజీనామాలతోనే ఆ రాష్ట్రం దేశ దృష్టిని ఆకర్షించగలదని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa