ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడో టెస్టుకు స్మిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించిన సీఏ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 26, 2018, 10:04 AM

క్రికెట్‌ ప్రపంచాన్ని కుదిపేసిన బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో తొలి వికెట్లు పడ్డాయి. మోసానికి నాయకత్వం వహించిన కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, ఉపసారథి డేవిడ్‌ వార్నర్‌లను క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఆ బాధ్యతల నుంచి తప్పించింది. జెంటిల్మన్‌ క్రీడ ప్రతిష్ఠను మంటగలిపిన వాళ్లిద్దరినీ వెంటనే తప్పించాలన్న డిమాండ్ల నేపథ్యంలో సీఏ ఈ నిర్ణయం తీసుకుంది. మూడో టెస్టు మూడో రోజు ఆట సందర్భంగా ఆసీస్‌ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్‌ ఓ టేపుతో బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడుతూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోవడం, సీనియర్‌ ఆటగాళ్లందరం కలిసే ఈ మోసానికి పాల్పడ్డామని స్మిత్‌ అంగీకరించడం తెలిసిందే. ‘‘స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌లతో మాట్లాడాం. టెస్టు మ్యాచ్‌లో మిగతా భాగానికి బాధ్యతల నుంచి తప్పుకోడానికి వాళ్లు అంగీకరించారు’’ అని సీఏ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జేమ్స్‌ సదర్లాండ్‌ ఓ ప్రకటనలో చెప్పాడు. స్మిత్‌ స్థానంలో వికెట్‌ కీపర్‌ టిమ్‌ పైన్‌ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది. ‘‘ఈ టెస్టు మ్యాచ్‌ కొనసాగాల్సిన అవసరం ఉంది. ఈ లోపు మేం బాల్‌టాంపరింగ్‌పై విచారణను కొనసాగిస్తాం. త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాం’’ అని అన్నాడు. టాంపరింగ్‌పై విచారణ జరిపేందుకు సీఏ అధికారులు లియాన్‌ రాయ్‌, పాట్‌ హొవార్డ్‌లు దక్షిణాఫ్రికా వెళ్లనున్నారు. ‘‘మాలాగే ఆస్ట్రేలియా వాసులందరూ సమాధానాలు కోరుతున్నారు. విచారణలో బయటపడ్డ అంశాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంటాం’’ అని ఆ ప్రకటనలో సదర్లాండ్‌ తెలిపాడు. క్రికెట్‌ ఆస్ట్రేలియా నియమావళి ప్రకారం.. మోసానికి పాల్పడిన క్రికెటర్లపై జీవితకాల నిషేధం విధించొచ్చు. మరి ఇప్పటికే నేరాన్ని అంగీకరించిన ఆటగాళ్లపై సీఏ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..!










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa