ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడిన వెస్టిండీస్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 02, 2018, 01:35 PM

అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. కరాచీ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 143 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్‌ని చిత్తుగా ఓడించింది. సుదీర్ఘకాలం తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన వెస్టిండీస్ జట్టు పాకిస్థాన్ బౌలర్ల ధాటికి విలవిలలాడింది. 204 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ కేవలం 60 పరుగులకే కుప్పకూలిపోయిందంటే పాక్ బౌలర్లు ఏ స్థాయిలో చెలరేగారో అర్థమవుతోంది. 


టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ మహ్మద్ పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఓపెనర్ బాబర్ అజామ్ (17) నిరాశపరిచినా.. ఫకార్ జమాన్ (39: 24 బంతుల్లో 6x4, 1x6), హుస్సేన్ (41: 37 బంతుల్లో 2x4, 1x6), కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (38: 22 బంతుల్లో 4x4, 1x6), షోయబ్ మాలిక్ (37: 14 బంతుల్లో 4x4, 2x6) దూకుడుగా ఆడారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి పాకిస్థాన్ 203 పరుగులు చేసింది. 


అనంతరం లక్ష్యఛేదనకి దిగిన వెస్టిండీస్ జట్టు ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. పాక్ బౌలర్లు మహ్మద్ అమీర్ (2/3), మాలిక్ (2/13), మహ్మద్ నవాజ్ (2/19) ధాటికి వరుసగా వికెట్లు చేజార్చుకుంది. ఆ జట్టులో మార్లోన్ శ్యామ్యూల్స్ (18) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఏడు మంది సింగిల్ డిజిట్‌కే ఔటై నిరాశపరిచారు. దీంతో.. వెస్టిండీస్ 13.4 ఓవర్లోలోనే 60 పరుగులకు ఆలౌటైంది. ఏప్రిల్ 7 నుంచి ఐపీఎల్ ప్రారంభంకానుండటంతో.. క్రిస్‌గేల్, పొలార్డ్ తదితర ప్రధాన క్రికెటర్లు ఈ పాక్ పర్యటనకి దూరమయ్యారు. రెండో టీ20 మ్యాచ్ సోమవారం జరగనుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa