మేడ్చల్ : ఈ నెల 27న జరగబోయే టీఆర్ఎస్ ప్లీనరీని ఘనంగా నిర్వహిస్తామని ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కొంపల్లిలో ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్లీనరీ నిర్వహణ కోసం 9 కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్లీనరీ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారని చెప్పారు. ప్లీనరీకి వచ్చే వారి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. నాణ్యమైన రాష్ట్ర వంటకాలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని.. ప్లీనరీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.