పోలవరం లాంటి ప్రాజెక్టును ఇకముందు ఎన్నడూ చూడలేమని.. ఇది దేశంలోనే అద్భుతమైన నిర్మాణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటివరకు 52.85 శాతం పూర్తయ్యాయని తెలిపారు. వచ్చే నెలలో అండర్గ్రౌండ్ డ్యామ్ పూర్తవుతుందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి ఈరోజు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు, విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. పోలవరంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు, నదుల అనుసంధానం పూర్తయితే రాష్ట్రంలో నీటికి కొరత ఉండదన్నారు. పోలవరం పూర్తిచేసే బృహత్తర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్రంలో కరువు అనేదే ఉండకూడదని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. నీటి కొరత సమస్య అధిగమించేందుకు నదుల అనుసంధానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు