ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్ని అద్భుతంగా ఆరంభించిన సన్రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుతం కష్టాలు ఎదురుకుంటుంది. గత రెండు మ్యాచ్ల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన ఈ జట్టు సభ్యుల గాయాలతో సతమతమవుతుంది. ఇప్పటికే ఓపెనర్ శిఖర్ ధవన్ గాయం కారణంగా జట్టుకి దూరమయ్యాడు. ప్రస్తుతం ఫిట్నెస్ పరీక్షలు చేసుకుంటున్న ధవన్ పూర్తిగా కోలుకుంటేనే తదుపరి మ్యాచుల్లో అడే అవకాశం ఉంది. ఈ రోజు ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్కి ముందు బౌలింగ్ సంచలనం భువనేశ్వర్ కుమార్ ఈ మ్యాచ్కి దూరమైనట్లు సమాచారం. జట్టు సభ్యులందరితో కలిసి భువనేశ్వర్ కుమార్ ముంబైకి చేరలేదు. అయితే భువీ ఫిట్నెస్ కారణంగానే ఈ మ్యాచ్ నుంచి విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విధ్వంసకర బ్యాట్స్మెన్ యూసుఫ్ పఠాన్ కూడా స్వల్ప గాయాలతో సతమతమవుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ముంబై ఇండియన్స్తో జరిగిన తొలి మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న రషీద్ ఖాన్ గడిచిన రెండు మ్యాచుల్లో అత్యంత చెత్త ప్రదర్శన చేశాడు. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 55 పరుగులు సమర్పించుకున్న రషీద్, చెన్నైతో జరిగిన మ్యాచ్లో అంతంత మాత్రంగానే బౌలింగ్ చేశాడు. దీంతో ఈ పరిస్థితుల్ని ముంబై తమకు అనుకూలంగా మార్చుకొనే అవకాశం ఉంది. అయితే భువనేశ్వర్ స్థానంలో శ్రీవత్స్ గోస్వామి, ధవన్ స్థానంలో ఇంగ్లాండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ని జట్టులోకి తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు ముంబై వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.