చిరుతపులి.. ఈ పేరు వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మరి అదే చిరుతపులి చీకట్లో కలిసిపోయినట్లుగా నల్లగా ఉంటే..! అలాంటి నల్ల చిరుత కళ్ల ముందుకొస్తే.. పై ప్రాణాలు పైనే పోయినంత భయమేస్తుంది కదా! ఏదో ‘జంగిల్ బుక్’ సీరియల్లో నల్ల చిరుత పులిని (భగీరా) చూపించారు గానీ, నిజంగా ఉంటుందా.. అనుకునేరు. అవును.. నల్ల చిరుతపులులు కూడా ఉన్నాయి. మరెక్కడో కాదు. మన భారత్లోనే.. అది కూడా మన పొరుగు రాష్ట్రం ఒడిశాలోనే.
ఒడిశాలోని సుందర్గఢ్ అడవుల్లో అరుదైన నల్ల చిరుతపులి (బ్లాక్ పాంథర్) కనిపించింది. అడవిలో అమర్చిన కెమెరాల్లో ఈ చిరుతపులి దృశ్యాలు రికార్డయ్యాయి. జీవ వైవిధ్యానికి పెట్టింది పేరైన భారత్లో 26 ఏళ్ల కిందట ఇలాంటి చిరుతపులులు సంచరించినట్లు రికార్డులు చెబుతున్నాయి. కానీ, అప్పట్లో అడవుల్లో కెమెరాలు అమర్చే విధానం లేకపోవడంతో వాటికి సంబంధించిన ఆధారాలు లేవు.
వన్య ప్రాణుల సంచారాన్ని, సమాచారాన్ని సేకరించేందుకు 2015లో అడవుల్లో కెమెరాలు ఏర్పాటుచేశారు. పరిశోధకులు అందుబాటులో లేని సమయంలోనూ రిమోట్ యాక్సెస్ ద్వారా వీటిని ఆపరేట్ చేస్తూ.. జంతువుల సంచారాన్ని నమోదు చేసేందుకు వీలుగా ఈ కెమెరాలు ఏర్పాటుచేశారు. ఇలాంటి పలు కెమెరాల్లో బ్లాక్ పాంథర్ ఉనికికి సంబంధించిన ఫొటోలు నమోదయ్యాయి. చిరుతపులి మాదిరిగానే పోలికలున్న ఈ బ్లాక్ పాంథర్.. నల్లని వర్ణంలో ఉంది.